నేను పులిని.. నన్నెవ్వరూ ఏం చేయలేరంటున్న దీదీ
వెస్ట్ బెంగాల్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో అధికార టీఎంసీ, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓ వైపు బీజేపీ ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దీదీకి భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ వేస్తున్న ఎత్తుగడలను చేధించేందుకు టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. ముర్షీదాబాద్ జిల్లాలోని బెర్హమ్పూర్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సభలో ఆమె బీజేపీపై తీవ్ర
స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తనను తాను బెంగాల్ టైగర్తో పోల్చుకున్నారు. తాను బెంగాల్ టైగర్నని.. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరని.. ఎవరి బెదిరింపులకు తలొగ్గోది లేదంటూ అభివర్ణించుకున్నారు. తాను బలహీన వ్యక్తిని కాదని.. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నార్సీ,సీఏఏ చట్టాలను తాను బహిరంగంగా వ్యతిరేకించానంటూ చెప్పుకొచ్చారు.
కాగా, లోక్సభ ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికార పార్టీని వీడుతున్న నాయకులపై టీఎంసీ గుండాలు దాడులకు దిగుతున్నారు. ఇటీవల ఓ ఎమ్మెల్యేకు గ్రామం విడిచి వెళ్లాలంటూ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే హతమార్చుతామంటూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే వంద మందికి పైగా బీజేపీ నేతలు టీఎంసీ గుండాల చేతిలో హతమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారే తప్ప.. నిందితులను పట్టుకోవడంలో విఫలమైనట్లు కమలం శ్రేణులు వాపోతున్నాయి.