తాను ఫ్రెండ్లీ గవర్నర్ నని మరోసారి స్పష్టం చేశారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అలాంటి తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తనకు ప్రభుత్వ పెద్దలు కనీస మర్యాద ఇవ్వడంలేదని ఆమె అన్నారు.కనీస ప్రొటోకాల్ పాటించడంలేదని…వ్యక్తిగతంగా అవమానిస్తే పట్టించుకోనని కానీ గవర్నర్ కార్యాలయానికైనా మర్యాద ఇవ్వాలని ఆమె అన్నారు. తెలంగాణ సర్కారు చేసిన మంచిపనులను పలుమార్లు అభినందించాన్నారు తమిళిసై. తాను వివాదాస్పద వ్యక్తిని కానని..అందరితో స్నేహంగా, పారదర్శకంగా ఉంటానని ఆమె అన్నారు. ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతున్న తన పట్ల టీఆర్ఎస్ సర్కారు ఎందుకలా వ్యవహరిస్తున్నదో అర్థం కావడం లేదన్నారు. ఎంజీఎం ఆస్పత్రి ఘటన గురించి ప్రస్తావించిన ఆమె…రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను బాగు చేయాలని అన్నారు.
కౌశిక్ రెడ్డి వ్యవహారంలో అభ్యర్థిత్వం మీద నేను సంతృప్తి చెందలేదని గుర్తు చేశారు. గతంలో ముగ్గురి విషయంలో ఆమోదం తెలిపాను. నేనేమీ వివాదాస్పదం చేయలేదనీ ఆమె అన్నారు. చిన్న కారణాలు సాకుగా చూపుతూ గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదని..అధికారులను సైతం హాజరు కానీయకుండా చేస్తూ ప్రొటోకాల్ నిబంధనల్నీ తన విషయంలో పాటించకపోవడం సరైందేనా అని ఆమె ప్రశ్నించారు. రాజ్ భవన్లో ఉగాది వేడుకల కోసం కూడా ఆహ్వానాలు పంపానని..అయినా ఇగ్నోర్ చేశారని..తాను మాత్రం ఎప్పటికీ అలా చేయబోనని గవ ర్నర్ అన్నారు.
ప్రధానితో సమావేశంలో తనపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు…పలు అంశాలపై గవర్నర్ చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నుంచి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడంతో సహా రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల గురించి ప్రధానికి గవర్నర్ వివరించినట్టు తెలిసింది. ఇంకా ప్రజాసంక్షేణ కార్యక్రమాల గురించీ వివరించిన ఆమె…ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రత్యేకంగా కోరినట్టు సమాచారం. అయితే తాను ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు మాత్రం రాలేదన్న ఆమె…ఓ డాక్టర్ గా దేశంలో భారీ వాక్సినేషన్ డ్రైవ్ పై ప్రధానికి ధన్యవాదాలు తెలిపానన్నారు. పుదుచ్చేరి తెలంగాణ మధ్య అన్ని రకాల పర్యాటక అవకాశాలను పరిశీలించామన్నారు. వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నాను. అందుకోసం రెండు ప్రాంతాల మధ్య విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.తెలంగాణలో ట్రైబల్ టూర్పై చర్చించినట్లుగా వెల్లడించారు.
తెలంగాణలో కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అసలైతే తమిళిసై సోమవారమే ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా చివరినిమిషంలో వాయిదా పడింది. రాజ్ భవన్, ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ పెరిగిందంటూ స్వయంగా గవర్నరే ఈనెల ఒకటో తేదీన వ్యాఖ్యానించారు. గ్యాప్ తన వైపు నుంచి జరగలేదని కూడా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉన్నపుడే గవర్నర్ ను పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల గవర్నర్ కు ప్రోటోకాల్ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్ ను మంత్రులు, కలెక్టర్, ఎస్పీ పట్టించుకోలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం సమావేశాలను నిర్వహించింది. కేంద్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రభుత్వం దూరంగా ఉంది. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకలకు గవర్నర్ ఆహ్వానించినా ముఖ్యమంత్రి సహా మంత్రులు ఎవరూ హాజరుకాలేదు. యాదాద్రికి వెళ్లినా కూడా అక్కడ అధికారులు స్వాగతం పలకలేదు. వీటన్నిటిపై ఇంటలిజెన్స్ వర్గాల నుంచి కేంద్రం వివరాలను సేకరించింది. ఇక తాజాగా నేరుగా ప్రధానినే కలిసి అన్ని విషయాలు వివరించారు గవర్నర్.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)