హైదరాబాద్ లో సంచలనం రేపిన బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను ట్రయల్ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరారు జూబ్లీహిల్స్ పోలీసులు. అమ్నేషియా పబ్ కు వచ్చిన బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ ఒక్కడే మేజర్ కాగా.. మిగిలిన ఐదుగురు మైనర్లు. సాదుద్దీన్ ను చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు.. ఐదుగురు మైనర్లను జూవైనల్ హోంకు తరలించారు. ఇప్పుడు ఈ ఐదుగురు మైనర్లనే మేజర్లుగా పరిగణించాలని జువైనల్ బోర్డును కోరారు.
మైనర్ల మానసిక స్థితి, నేరం చేయడనికి వారికి ఉన్న సామర్ధ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకునీ జువైనల్ బోర్డు జస్టిస్ నిర్ణయం తీసుకోనున్నారు.
నిందితుల్లో మేజర్ అయిన సాదుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న వెంటనే ఉస్మానియాకు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. నాలుగు రోజుల పాటు మాలిక్ ను విచారించనున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఆమ్నేషియా పబ్, కాన్ సీ యు బేకరీ, అత్యాచారం జరిగిన ప్రాంతాలకు నిందితుడిని తీసుకెళ్లనున్నారు పోలీసులు. గ్యాంగ్ రేప్ తర్వాత నిందితులు ఇన్నోవా కారును దాచి పెట్టిన ఫాంహౌజ్ ప్రాంతానికి సాదుద్దీన్ ను తీసుకెళ్లి వివరాలు సేకరించనున్నారు.
మరోవైపు నిందితులైన ఐదుగురు మైనర్లకు ప్రభుత్వ వైద్యులతో పోటెన్సీ టెస్ట్ చేయించనున్నారు. లైంగిక పటుత్వం కోసం చేసే ఈ టెస్ట్… చార్జిషీట్ దాఖలకు కీలకం కావడంతో కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.