తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నగర నడిబొడ్డున బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం ఉదయం దాడి జరిపినప్పుడు పబ్లో పలువురు ప్రముఖుల పిల్లలు ఉండడం సంచలనం సృష్టించింది. అయితే పబ్లో ఓ బర్త్డే పార్టీకి తమ పిల్లలు వెళ్లారని, డ్రగ్స్తో వారికి ఎటువంటి సంబంధం లేదని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో పెద్ద శబ్దాలు వస్తున్నాయని, పెద్ద ఎత్తున పార్టీ జరుగుతోందని, కస్టమర్లు డ్రగ్స్ కూడా సేవిస్తున్నారని పోలీసులకు శనివారం అర్ధరాత్రి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసుల సహాయంతో అర్ధరాత్రి 2 గంటలకు పబ్ లోపలికి ప్రవేశించారు. అక్కడ వారికీ 5 తెల్లటి పొడి ప్యాకెట్లు లభించాయి. పబ్ మేనేజర్ అనిల్కుమార్, పార్ట్నర్ అభిషేక్ తోపాటు ఆ సమయంలో పబ్లో ఉన్న 148 మంది యువతీ యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, సినీనటుడు నాగబాబు కూతురు నిహారిక తోపాటు మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ కుమారుడు ఉన్నారు. వీరితోపాటు సిద్దార్థ్ గల్లా అనే పేరు, ఏపీలోని ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి కూతురు, మాజీ ఎమ్మెల్యే కుమారుడి పేరు కూడా పోలీసులు వెల్లడించిన జాబితాలో ఉన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 20 మంది పబ్ సిబ్బంది, 90 మంది యువకులు, 38 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. పబ్ మేనేజర్ క్యాబిన్ దగ్గర 5 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పబ్లో దొరికిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. డ్రగ్స్ సరఫరా దారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలీసులు.