హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL) కాంట్రాక్ట్ ఉద్యోగి భారతదేశం మిస్సైల్ డెవలప్మెంట్ కు సంబంధించిన రహస్య రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్లోని ఆరోపించిన ISI కార్యకర్తకు సోషల్ మీడియా ద్వారా అందించినందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
స్పెషల్ ఆపరేషన్ టీమ్ జూన్ 17న ఎల్బీ నగర్ జోన్, రాచకొండ సహా బాలాపూర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో హైదరాబాద్లోని బాలాపూర్లోని త్రివేణి నగర్లోని అతని నివాసంలో దుక్కా మల్లికార్జున రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టు అనే 29 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి సుధీర్ బాబు, ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, డీసీపీ (ఎస్ఓటీ) కే మురళీధర్, రాచకొండ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు.
డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ లాబొరేటరీ కాంట్రాక్టు ఉద్యోగి డిఆర్డిఎల్-ఆర్సిఐ కాంప్లెక్స్కు సంబంధించిన అత్యంత సురక్షితమైన, గోప్యమైన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా అనుమానిత ఐఎస్ఐ మహిళా హ్యాండ్లర్కు షేర్ చేసాడు, ఇది జాతీయ సమగ్రత, భద్రతకు హాని కలిగించే అవకాశం ఉంది” అని ఒక ప్రకటనలో పోలీసులు తెలిపారు.
నిందితుడిపై రాచకొండ పోలీస్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సెక్షన్ 409 తోపాటు ఆఫీసియల్ సీక్రెట్ యాక్ట్-1923లోని 3 (1) (C), 5 (3), 5 (1) (A) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని రెండు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డు, ల్యాప్టాప్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు హైదరాబాద్లోని బాలాపూర్లోని డిఫెన్స్ ల్యాబ్ లోని RCI కాంప్లెక్స్లో క్లాసిఫైడ్ అడ్వాన్స్డ్ నావల్ సిస్టమ్ ప్రోగ్రామ్లో పనిచేస్తున్నాడు. అతను మార్చి 2018లో Facebookలో DRDLతో తన ఉద్యోగ స్టేటస్ ను అప్డేట్ చేశాడు. రెండు సంవత్సరాల తర్వాత, మార్చి 2020లో నటాషా రావు అనే పేరును ఉపయోగించి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) హ్యాండ్లర్ అతన్ని సంప్రదించింది. ఆమె తనను తాను UK డిఫెన్స్ జర్నల్ ఉద్యోగిగా పరిచయం చేసుకుంది, ఆమె తండ్రి యునైటెడ్ కింగ్డమ్కు మకాం మార్చడానికి ముందు భారత వైమానిక దళంలో పనిచేశాడని చెప్పింది.
నటాషా రావు అలియాస్ సిమ్రాన్ చోప్రా అలియాస్ ఒమిషా అడ్డీ, నిందితుడితో సోషల్ మీడియాలో స్నేహం చేసి, ఆపై ప్రేమ, పెళ్లి పేరుతో అతన్ని హనీ-ట్రాప్ చేసి, DRDL-RCI కాంప్లెక్స్ గురించి సున్నితమైన సమాచారాన్ని లీక్ చేయమని కోరింది.
నిందితుడు గత సంవత్సరం డిసెంబర్ వరకు ISI హ్యాండ్లర్కు రహస్య రక్షణ వివరాలను బదిలీ చేస్తూనే ఉన్నాడు, అయితే నటాషా తన ఫేస్బుక్ ప్రొఫైల్ పేరును సిమ్రాన్ చోప్రాగా మార్చినప్పుడు.. అతనితో చాట్ చేయడం మానేసినప్పుడు అతనికి అనుమానం వచ్చింది. విచారణలో నటాషా నిందితుడి బ్యాంక్ ఖాతా వివరాలను కూడా కోరినట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఆమె ఖాతా నుంచి డబ్బును బదిలీ చేసిందా లేదా అనేది వారు ఇంకా నిర్ధారించలేదు.