3. బల్దియా చరిత్ర బహుఘనం
హైదరాబాద్ నగరానికి 429 సంవత్సరాల కిందట బీజం పడింది. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా, 1933లో చాదర్ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్పడింది. 1948-56 మధ్య కాలంలో హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడే 1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. హెచ్ఎంసీ యాక్ట్ కింద నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బల్దియా చరిత్ర, మేయర్ల వివరాలను ఒకసారి చూద్దాం..
బల్దియా ఇలా మొదలైంది…
మున్సిపాలిటీ స్థాయి నుంచి గ్రేటర్ హైదరాబాద్గా అభివృద్ధి చెందిన భాగ్యనగరానికి 147 ఏండ్ల ఘన చరిత్ర ఉంది. 1869లో ఆనాటి హైదరాబాద్ ప్రధాని సర్ సాలార్జంగ్-1 హైదరాబాద్ బోర్డ్, చాదర్ఘాట్ బోర్డ్ పేరుతో రెండు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి, మున్సిపల్ కమిషనర్లను నియమించారు. అంతకు ముందు హైదరాబాద్ పాలనా నిర్వహణ బాధ్యతల్ని పోలీసు కమిషనరే(బల్దియా కొత్వాల్) నిర్వహించేవారు. 1869లో హైదరాబాద్ 55 చ.కి.మీ. పరిధిలో మూడున్నర లక్షల జనాభా కలిగివుండేది. 1933లో హైదరాబాద్ మున్సిపల్ చట్టం ద్వారా చాదర్ఘాట్ను హైదరాబాద్లో కలిపేసి కార్పొరేషన్గా మార్చారు. 1934లో హైదరాబాద్ కార్పొరేషన్కు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించారు.
ప్రభుత్వ వర్గాల్లో అభిప్రాయ భేదాలు రావడంతో 1942లో హైదరాబాద్కు కార్పొరేషన్ హోదాను తొలగించారు. 1937లో జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ను కలిపి జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 1945లో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటైంది. 1950లో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్లో కలిపేసి కార్పొరేషన్ హోదాను పునరుద్ధరించారు. అదేయేట సికింద్రాబాద్కు కూడా కార్పొరేషన్ హోదా ఇచ్చారు. 1955లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ద్వారా జంట నగరాలను కలిపేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీహెచ్)గా మార్చారు. 94 డివిజన్లతో ఎంసీహెచ్ ఏర్పాటైంది.
1956లో తెలంగాణ(హైదరాబాద్) రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన విషయం తెలిసిందే. సమైక్యరాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉన్న కాలంలో మరికొన్ని పరిణామాలు జరిగాయి. 1960లో ఎంసీహెచ్కు మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 1964లోనూ, 68లోనూ, తిరిగి 1986లోనూ, 2002లోనూ ఎన్నికలు నిర్వహించారు. 1986లో డివిజన్ల సంఖ్యను 94 నుంచి 100కు పెంచారు. 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను హైదరాబాద్లో కలిపేసి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేశారు. 150 డివిజన్లున్న జీహెచ్ఎంసీ వైశాల్యం 650 చ.కి.మీ. జీహెచ్ఎంసీగా మారిన తర్వాత 2009లో మొదటి ఎన్నికలు జరిగాయి. జీహెచ్ఎంసీకి 2016లో జరిగినవి రెండో ఎన్నికలు. ప్రస్తుతం మూడో ఎన్నికలు నిర్వహించనున్నారు.
మొదటి మహిళా మేయర్ రాణీ కుముదినీ, దళిత మేయర్ ఎంఆర్ శ్యాంరావు…
బల్దియాకు మొదటి మహిళా మేయర్గా రాణీ కుముదినీ దేవి 1962లో ఎన్నిక కాగా, మొదటి దళిత మేయర్గా ఎంఆర్ శ్యాంరావు 1964లో ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ స్థాయి నుంచి నేటి గ్రేటర్ హైదరాబాద్గా ఎదిగిన బల్దియా 147 ఏళ్లలో కేవలం 27 ఏళ్లు మాత్రమే ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పాలనలో ఉన్నది. మిగతా కాలమంతా ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, నామినేటెడ్ మేయర్ల పాలనలోనే ఉన్నది. నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్లో సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ మేయర్లే అధికారంలో ఉన్నారు. 1986 నుంచి 91 వరకు ఎంఐఎంకు చెందిన ఐదుగురు మేయర్లు పగ్గాలు చేపట్టారు. వారిలో ముగ్గురు హిందువులు కూడా ఉన్నారు. 2002 నుంచి 2007 వరకు టీడీపీకి చెందిన తీగల కృష్ణారెడ్డి మేయర్గా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఎవరికీ సరిపడినంత మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్-ఎంఐఎంలు అధికారాన్ని పంచుకునేందుకు అంగీకారం కుదుర్చుకున్నాయి. 2014 వరకు ఆ రెండు పార్టీల తరపున బండా కార్తీకరెడ్డి (2009-11), మజీద్ హుస్సేన్ (2012-14) మేయర్లుగా పని చేశారు. ప్రస్తుతం 2016 ఫిబ్రవరి,11 నుంచి టీఆర్ఎస్ తరఫున బొంతు రామ్మోహన్ మేయర్ గా కొనసాగుతున్నారు.
ఇక 2015లో ఒక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే ఆమోదించారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు చట్టం చేశారు.
అలాగే జిహెచ్ఎంసి సవరణ బిల్లు 2020 ఆమోదం పొందిన విషయం తెలిసిందే. జిహెచ్ఎంసి చట్ట సవరణ లో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు పూర్తి జవాబుదారీతనం, బాధ్యతలకు సంబంధించిన నిబంధనలు చేర్చారు. విధులు సక్రమంగా నిర్వహించని ప్రజాప్రతినిధులు, అధికారులను తొలగించేలా కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత. పదిశాతం హరితకు బడ్జెట్, వార్డు కమిటీల ఏర్పాటు వాటి పనివిధానంలో మార్పులు, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ల అభివృద్ధి, రెండు సార్లు ఒకే రిజర్వేషన్ అమలు సహా జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలను ప్రతిపాదించారు.
బల్దియా మేయర్లు…
మాడపాటి హనుమంతరావు 1952-54
ధరణీధర్ సంఘీ 1954-55
షాబుద్దీన్ అహ్మద్ఖాన్ 1955-56
బీ కిషన్లాల్ 1956-58
కృష్ణస్వామి ముదిరాజ్ 1958-59
మీర్ అక్బర్ అలీఖాన్ 1959-60
వేద్ ప్రకాశ్ 1960-61
రామమూర్తి నాయుడు 1961-62
రాణీ కుముదినీ దేవి 1962-63
బనారసీలాల్ గుప్తా 1963-64
ఎంఆర్ శ్యాంరావు 1964-65
సరోజినీ పుల్లారెడ్డి 1965-66
అక్బర్ అలీఖాన్ 1966-67
కే కొండారెడ్డి 1967-68
బీ కుముద్ నాయక్ 1968-69
ఎన్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ 1969-70
కే ప్రకాశ్రావు 1986-87
ఎంకే మోబిన్ 1987-88
అనుమల సత్యనారాయణ 1988-89
మీర్ జుల్ఫీకర్ అలీ 1989-90
అల్లంపల్లి పోచయ్య 1990-91
తీగల కృష్ణారెడ్డి 2002-07
బండా కార్తీకరెడ్డి 2009-11
మహ్మద్ మజీద్ హుస్సేన్ 2012-14
బొంతు రామ్మోహన్ – 11 ఫిబ్రవరి 2016 నుంచి – టీఆర్ఎస్