ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న దాదాపు వందమందికి మరణశిక్ష విధించారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్టు.. ఇరాన్ మానవ హక్కుల సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. నార్వే కేంద్రంగా పని చేస్తున్న ఐహెచ్ఆర్ విడుదల చేసిన నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం, మరణశిక్ష బాధితులు తమ సొంత న్యాయవాదిని నియమించుకునేందుకు, సముచిత న్యాయ ప్రక్రియ, నిష్పాక్షిక విచారణలకు అవకాశం లేకుండాపోయింది.
హిజాబ్ ను సక్రమంగా ధరించలేదనే కారణంతో మహసా అమిని అనే 22 ఏళ్ళ యువతిని సెప్టెంబరులో ఇరాన్ మోరలిటీ పోలీసులు నిర్బంధించారు. పోలీసుల కస్టడీలో ఉండగా ఆమె చనిపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఇంకా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఐహెచ్ఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం, 476 మంది నిరసనకారులు హత్యకు గురయ్యారు. వీరిలో 64 మంది బాలలు, 34 మంది మహిళలు ఉన్నారు.