ఆఫ్గనిస్తాన్ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. రాక్షస మష్కరులు ఏకంగా వందమంది విద్యార్థులను పొట్టనబెట్టుకున్నారు. రాజధాని కాబూల్లోని ఓ విద్యాసంస్థలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. చనిపోయిన విద్యార్థుల్లో ఎక్కువగా హజారాలు, షియాలే. హజారాలు ఆఫ్గనిస్తాన్లో మూడో అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్నారు.
దస్త్-ఇ-బార్చి ప్రాంతంలోని కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది.మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. యూనివర్సిటీ మాక్ ఎగ్జామ్ ఉండడంతో చాలామంది విద్యార్థులు ఒకే హాల్లో ఉన్నారు. ఘటనకు ముందు తీసిన క్లాస్ రూం వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాంబ్ పేలుడు తరువాత ఆ ప్రాంతం పూర్తిగా రక్తసిక్తమైంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విద్యార్థుల కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. గది మూలమూలలా మాంసంముద్దలే.
దాడి ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ (ISKP) ఉగ్రవాదుల పనేనని తేలింది. విద్యార్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఉగ్రవాది ఒకడు గదిలోకి చొరబడి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనను అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచదేశాలు ఖండించాయి.