తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొన్ని తరాలపాటు గుర్తించుకునేలా ఈ రాజధాని నిర్మించాలని ప్రభుత్వం తలపోస్తోంది. అందుకోసం నిపుణులను పిలిపించి అధికారులు మంత్రుల స్థాయిలో సమాలోచనలు జరుపుతున్నారు. ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇందుకు సంబంధించిన నివేదికలు అందిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం అమరావతి పరిధిలో ‘నవ నగరాల’ నిర్మాణం జరగనుంది. సీఆర్డీయే పరిధిని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దేశంలోని టాప్ 10 కాలేజీలు, ఆస్పత్రులకు సంబంధించిన బ్రాంచ్ కార్యాలయాలు అమరావతిలోనే ఏర్పాటు కావాలని తలపోస్తున్నారు., కరకట్టపై సెంట్రల్ డివైడర్తో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపడతారు. దీంతోపాటు అమరావతిని అనుసంధానించేలా కృష్ణా నదిపై నాలుగు బ్రిడ్జీలు ఐకానిక్గా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు . విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్ బ్రిడ్జిపై మరోసారి అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకుంటారు.
మరోవైపు, కోర్ క్యాపిటల్ సిటీ పరిధి 217 చదరపు కిలోమీటర్లు గా నిర్ణయించుకుని అందులో కళ్ళు చెదిరే నిర్మాణాలు చేపట్టబోతున్నారు. సిటీలో తూర్పు నుంచి పడమరకు ఒక రహదారి గ్రిడ్ను ఏర్పాటు చేసి దాన్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తారు. ప్రతి కిలోమీటర్కు ఒక రోడ్డు ఉంటుంది. ఇందులో నాలుగైదు రోడ్లను నేరుగా నేషనల్ హైవేకు కలిపేలా చర్యలు తీసుకుంటారు. ఒక సంవత్సరంలో వాటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. కొండలు ఉన్న చోట వాటి పక్క నుంచి ఈరోడ్లను నేషనల్ హైవేకు కలుపుతారు.
అమరావతిలో నిర్మించే ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ల ద్వారా కృష్ణానదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలు ఏర్పాటు అవుతాయి. ఇప్పటికే నదిపై రెండు సాధారణ బ్రిడ్జీలు ఉండగా, మరొకటి త్వరలో అందుబాటులోకి వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్డు కేంద్రం నిర్మిస్తే, ఇన్నర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. అమరావతిలో తూర్పు వైపున పశ్చిమం వైపున రెండు వేరు వేరు బైపాస్ రోడ్లు వస్తున్నాయి. తూర్పు బైపాస్ రోడ్డు త్వరలో పూర్తి అవుతుంది అంచనా వేస్తున్నారు.
గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు జరిపారు. తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు మరో రెండేళ్లపాటు గడువును పొడిగించారు. ఈ రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభించక పోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతిని నవ నగరాల సముదాయంగా ,, కళ్ళు చెదిరే రాజధానిగా తీర్చి దిద్దుతామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ దీనికి అయ్యే ఖర్చు కూడా అంతే భారీ స్థాయిలో కనిపిస్తోంది. మరి ఇంత మొత్తంలో నిధులను ఎలా సమీకరిస్తారు అనేది చిక్కు ప్రశ్న. నిధులను తెచ్చుకోకపోతే మరోసారి గ్రాఫిక్ బొమ్మలు చూపించారు అన్న చెడ్డ పేరును తెచ్చుకోవాల్సి వస్తుంది.