ప్రపంచానికి ఐశ్వర్య రాయ్, సచిన్ వంటి పేర్లతో ప్రత్యేకమైన మామిడి పండ్లను అందించిన హార్టీకల్చరిస్ట్(ఉద్యానవన శాస్త్రవేత్త) హాజీ కలీముల్లా ఖాన్ మామిడికి సంబందించిన రెండు రుచికరమైన కొత్త సంకరజాతులను అభివృద్ధి చేసారు. వాటికి హోం మంత్రి అమిత్ షా పేరుతో “అమిత్ షా ఆమ్”.. బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ పేరుతో “సుష్మిత ఆమ్” అని పేర్లు పెట్టారు.
ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్లో ఉన్న అతని తోటలో ఈ రెండు రకాల మామిడిపండ్లను అభివృద్ధి చేశారు. తాను అభివృద్ధి చేసిన సంకరజాతి మామిడి పండ్ల వెరైటీలకు ప్రముఖుల పేర్లను పెట్టి ఆకట్టుకోవడం ఆయనకు అలవాటే.
గతంలో ఆయన వేరొక మామిడి వెరైటీకి ‘ఐశ్వర్య ఆమ్’ అని పేరు పెట్టారు. సుస్మితా సేన్ గురించి నాకు చాలా కాలం తరువాత ఎవరో చెప్పారు. ఆమె అందం ఎప్పుడూ ఈ ప్రపంచంలో ఉండాలని నేను కోరుకుంటున్నా.. అదేవిధంగా ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. అందుకే ఈసారి ఈ మామిడి వెరైటీని డెవలప్ చేసి ఆమె పేరును పెట్టాను అని ఆయన చెప్పుకొచ్చారు.
82 ఏళ్ల వృద్ధుడైన హాజీ కలీముల్లా ఖాన్.. ములాయం ఆమ్, నమో ఆమ్, సచిన్ ఆమ్, కలాం ఆమ్, అమితాబ్ ఆమ్ సహా యోగి ఆమ్ వంటి 300కు పైగా ప్రత్యేకమైన మామిడి పండ్లను పండించారు. అతను ఉద్యానవన రంగానికి చేసిన కృషికి అలాగే మామిడి రకాలను సంరక్షించడం, విస్తరించడంలో చేసిన కృషికి 2008లో ఖాన్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది.