హిందూస్థాన్ మోటార్స్ తయారు చేసిన ఐకానిక్ అంబాసిడర్ కారు కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశ వీధుల్లో సర్వసాధారణంగా కనిపించేది. దేశంలో కార్ల తయారీ నిలిచిపోయిన సంవత్సరాల తర్వాత.. ఈ కారు టెక్నికల్ గా అభివృద్ధి చెందిన మోడల్తో మార్కెట్లోకి తిరిగి అడుగు పెట్టనుంది.
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నందున.. హిందుస్థాన్ మోటార్స్ ఈ సరికొత్త కారుతో మార్కెట్లో పేరు తెచ్చుకోవచ్చని భావిస్తున్నారు.
హిందూస్తాన్ మోటార్స్ అంబాసిడర్ సరికొత్త EV మోడల్ను విడుదల చేయడానికి యూరోపియన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థతో చేతులు కలిపిందని సమాచారం. కారు తయారీకి సంబంధించి రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
హిందుస్థాన్ మోటార్స్, దాని యూరోపియన్ భాగస్వామి మొదట భారతదేశంలోఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తారని తర్వాత నెమ్మదిగా ఫోర్ వీలర్ వాహనాలను రూపొందిస్తారని తెలిసింది. వారి మధ్య ఒప్పందం 51:49 నిష్పత్తిలో ఉంటుందని భావిస్తున్నారు, నియంత్రణ వాటా హిందుస్థాన్ మోటార్స్తో ఉంటుంది.
అంబాసిడర్ కారుకు భారత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. ఈ కొత్త వెంచర్ హిందూస్థాన్ మోటార్స్ను దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటిగా మరోసారి నిలబెట్టగలదని ఆశిస్తున్నారు.
1970వ దశకంలో హిందూస్థాన్ మోటార్స్ అంబాసిడర్ అనేది భారతీయ వీధుల్లో సర్వసాధారణం. ఎందుకంటే కార్ల తయారీ సంస్థ అప్పటికే దశాబ్దాలుగా ఆటోమొబైల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది. అత్యంత చవకైన మారుతీ 800ని విడుదల చేయడం ద్వారానే అంబాసిడర్ కారుకు గండి పడింది. గతంలో Mitsubishi కార్ల తయారీకి వినియోగిస్తున్న హిందుస్థాన్ మోటార్స్ చెన్నై ప్లాంట్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ అంబాసిడర్ కారు తయారీ జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చివరి అంబాసిడర్ కారు 2014లో పశ్చిమ బెంగాల్ నుంచి విడుదలైంది.