
Pic Credits : Dighvijay News
కర్నాటక హిజాబ్ దుమారం ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ఇక తాజాగా వివాదానికి వేదికగా మారిన ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు 35 ఏళ్లుగా కాలేజీకి ఏ ఒక్క విద్యార్థినీ హిజాబ్ తో రాలేదని ఆయన అన్నారు. సీఎఫ్ఐ లాయర్ తో కలిసి వచ్చిన ఆ ఒకరిద్దరు మాత్రమే కొత్తగా హిజాబ్ కోసం పట్టుపట్టారని చెప్పారు. హిజాబ్ తో కాలేజీకి అనుమతిస్తాం తప్ప… ఆవరణలోకి రాగానే వాటిని తొలగించే తరగతి గదిలోకి వెళ్తారని…35 ఏళ్లుగా దానిమీద ఎప్పుడూ ఇలా చర్చ కానీ వివాదం కానీ రేగలేదని తెలిపారు. ఎవరూ హిజాబ్ తో వస్తామని అభ్యర్థించిన సందర్భమూ లేదంటున్నారు. డిసెంబర్ 27 తరువాత మాత్రమే అదీ కొందరు మాత్రమే హిజాబ్ ధరించివచ్చారని… అందుకు మేం ఒప్పుకోలేదని చెప్పారు.
రుద్ర గౌడ చెప్పిన వివరాల ప్రకారం కొందరు విద్యార్థులు తల్లిదండ్రులతో వచ్చారు. వారు గొడవ చేయబోతే అధ్యాపకులు నచ్చజెప్పారు. యూనిఫాం నిబంధన పాటించేలా బాలికలను, తల్లిదండ్రులను కూడా ఒప్పించారు. అయితే మరుసటి రోజు మాత్రం కొత్తవాళ్లను వెంట బెట్టుకొచ్చి వాళ్లని తల్లిదండ్రులగా చెప్పి గొడవ చేయబోయారు. ప్రిన్సిపల్ సహా ఇతర కాలేజీ బృందం వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అంతా సద్దుమణిగింది అన్న సమయంలో మరునాడు సీఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మరికొందరితో వచ్చి గొడవచేశారు. కాలేజీలో ఓ క్రమశిక్షణ అంటూ ఉంటుంది మీతో మాకు పనిలేదని కాలేజీ సిబ్బంది చెప్పినా వినలేదు. తల్లిదండ్రులు, పిల్లలు ఒప్పుకున్నాక మీకేంటి అని చెప్పినా వినకుండా నినాదాలతో హోరెత్తిస్తూ రచ్చ చేశారు.
గొడవ పెద్దదవుతుందని గ్రహించిన కాలేజీ అధ్యాపకులు సిబ్బంది తల్లిదండ్రులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు. బయటిశక్తుల మాయలో పడిపోయిన ఒకరిద్దరు మొండివాదన మొదలు పెట్టారు. అయితే పిల్లలకు నచ్చజెప్పాల్సిందిగా తల్లిదండ్రులకూ ప్రిన్సిపల్ విజ్ఞప్తి చేశారు. కానీ ఈలోగా జమాతే సహా మరికొన్ని బయటి శక్తులమద్దతు పెరగడంతో గొడవ తీవ్రమైంది. ముఖ్యంగా సీఎఫ్ఐ నెలరోజులముందునుంచే ఇందుకు పథక రచన చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్రసంస్థలతోసంబంధాలున్నట్టు చెబుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ…విద్యార్థి విభాగమే క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సీఎఫ్ఐ. విద్యాసంస్థలో వందమందిపైగా ముస్లిం విద్యార్థులున్నాయని అందరూ డ్రెస్ కోడ్ నిబంధనను పాటిస్తూ తరగతులకు హాజరవుతున్నారని ప్రిన్సిపల్ చెబుతున్నారు. ప్రశాంతంగా తరగతులు జరిగేవని కొత్తగా కావాలని వివాదం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.