కర్నాటక హిజాబ్ వ్యవహారంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ సంపూర్ణ ధర్మాసనం బుధవారం విచారణను తిరిగి ప్రారంభించనుంది.
కుందపుర కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల తరపున సీనియర్ అడ్వకేట్ దేవదత్త కామత్ వాదనలు వినిపించారు. భారత దేశ రాజ్యాంగం సకారాత్మక లౌకికవాదాన్ని అనుసరిస్తోందని, ఇది టర్కీ రాజ్యాంగం వంటిది కాదని …ప్రతి ఒక్కరి మతపరమైన హక్కులు ఉంటాయని అన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివే ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఉందని…అధికరణ 25(1) పరిధిలోనికే ఈ మౌలిక మతపరమైన ఆచారాలు వస్తాయన్నారు. అయితే ఖురాన్లో చెప్పినవన్నీ అనివార్యమైన, ముఖ్యమైన మతపరమైన ఆచారాలా? అని ధర్మాసనం ప్రశ్నించగా కామత్ కాదని బదులివ్వడం విశేషం.
అటు ఐదురోజుల తరువాత కర్నాటకలోని విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే విద్యార్థులు తరగతి గదుల్లోకి హిజాబ్ తొలగించి రావాలని కళాశాల అధ్యాపకులు కోరారు. దీంతో వారంతా హిజాబులు తీసేసి హాజరయ్యారు. అందుకు వారి తల్లిదండ్రులూ అంగీకరించారు. ముందు జాగ్రత్త చర్యగా ఉడిపి, మంగళూరులో శనివారం వరకు నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు. ఫిబ్రవరి 19 వరకు అన్ని ఉన్నత పాఠశాలలకు 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)