కోవిడ్ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది.
జపాన్ యూఎస్ఏ, కొరియా, బ్రెజిల్, చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు వ్యూహాన్ని రూపొందించడానికి కేంద్ర ఆరోగ్యశాఖ న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. దేశంలో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించడానికి వారానికొకసారి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలో కోవిడ్ ఇంకా ముగియలేదని, అప్రమత్తంగా ఉండాలని, నిఘాను పటిష్టం చేయాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ జోడో యాత్ర నడుస్తున్న రాజస్థాన్లో కోవిడ్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.