ఎండాకాలం వస్తుంది పోతుంది అనుకుంటాం.. కానీ కొంతకాలంగా వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ కాలుష్యం కారణంగా ఈ ఏడాది ఎండాకాలం మంట పెడుతోంది. ఈ సంవత్సరంలో ఎండల కారణంగా అనేకమంది చనిపోయారు వీరిలో చాలామంది సరైన నివాసం, ఫ్యాన్ లు ఏసీ వంటి సౌకర్యాలు లేని పేదవారే .
సాధారణంగా ఏదైనా అగ్నిప్రమాదం వరదలు వంటివి చోటుచేసుకుని ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది. ఎందుకంటే దాన్ని విపత్తుగా గుర్తిస్తారు. కానీ ఎండల్ని విపత్తుగా గుర్తించకపోవడంతో ఇటువంటి పేదలకు ఎటువంటి సహాయం అందట్లేదు. దీని మీద రాజస్థాన్ హైకోర్టు స్పందించింది.
దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్పైగా నమోదవుతున్నాయి. ఎండలకు తాళలేక వందలాది మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాజస్థాన్తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో ఎండలను తట్టుకోలేక వడదెబ్బ బారిన పడి వందల సంఖ్యలో ప్రజలు మరణించారు. అయితే జనాన్ని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
కాగా, రాజస్థాన్ హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎండలకు జనం పిట్టల్లా రాలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. జస్టిస్ అనూప్ కుమార్ దాండ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. వరదలు, తుఫానుల మాదిరిగా వేడి, చలి గాలులను జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది.
మరోవైపు వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించే చర్యలు చేపట్టాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే ‘హీట్ యాక్షన్ ప్లాన్’ను సమర్థవంతంగా అమలు చేసేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వివిధ శాఖలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘మనం వెళ్లగలిగే మరో గ్రహం లేదు. మనం ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే, మన భవిష్యత్ తరాల వృద్ధి అవకాశాలను కోల్పోతాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
మొత్తం మీద హైకోర్టు పుణ్యమా అని నిరుపేదలకు సహాయం అందితే అదే పదివేలు.