తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నీ అడ్డుపెట్టుకుని భార్య పేరుట భూములు కొట్టేశారు అని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి గట్టి ఆధారాలతో కూడిన ఆరోపణలు బయటకు వచ్చాయి.
ఈ మేటర్ నిదానంగా గవర్నర్ దృష్టికి వెళ్లడంతో అంతా కదిలింది. ముడా భూముల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్పందించారు.
సుమారు 14 సైట్లను అక్రమ రీతిలో సీఎం సిద్దరామయ్య భార్యకు అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో సీఎం సిద్దును విచారించాలని గవర్నర్ గెహ్లాట్ ఆదేశాలు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం, భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 218 ప్రకారం.. సీఎంను విచారించే అవకాశాలు ఉన్నట్లు గవర్నర్ తన ఆదేశాల్లో తెలిపారు. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని ఆయన ఆదేశాలు జారీచేశారు.
దీని మీద సిద్దు న్యాయపోరాటానికి దిగారు.
గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య వేసిన పిటిషన్పై జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆయన తన స్వీయ నిర్ణయాధికారాన్ని సక్రమంగా అన్వయించారని వ్యాఖ్యానించింది. ఆయన ఆదేశాలకు సంబంధించినంత వరకు, గవర్నర్ చర్యలలో ఎటువంటి తప్పిదం లేదని కోర్టు అభిప్రాయపడింది.
కొంతకాలంగా ఈ విషయం కోర్టులో పెండింగ్లో ఉంది.
గవర్నర్ ఆదేశాలను సిద్ధూ గత నెలలోనే హైకోర్టులో సవాల్ చేయగా.. స్వల్ప ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ ముందుకెళ్లొద్దని సూచించింది. తాజాగా, ఈ పిటిషన్పై తీర్పు వెలువరించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. గవర్నర్ చర్యను సమర్దించింది.
ఇప్పుడు ముఖ్యమంత్రి మీద దర్యాప్తు జరగడానికి మార్గం క్లియర్ అయింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.