బీజేపీ తెలంగాణ చీఫ్ బండిసంజయ్ పాదయాత్రకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి సోమవారం ఆయన పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తుండగా..పాదయాత్రకు అనుమతి లేదంటూ….జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయన యాత్రకు షరతులతో కూడిన మద్దతు ఇచ్చింది. ప్రారంభోత్సవ సభ భైంసాకు కనీసం మూడు కిలోమీటర్ల దూరం ఉండాలని సూచించింది. అటు హైకోర్టు ఆదేశాలపై హర్షం వ్యక్తం చేశారు సంజయ్. హైకోర్ట్ ఆదేశాలు పాటిస్తూ సంగ్రామయాత్ర మొదలుపెడతామన్నారు. ఈమేరకు పార్టీ రూట్ మ్యాప్ రూపొందించారు. ఇక నిర్మల్ సమీపంలోని ఆడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి ఇవాళ లాంఛనంగా పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మంగళవారం మధ్యాహ్నం బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తోంది పార్టీ. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపైనా ఆయన మండిపడ్డారు. భైంసాకు తనను దూరం చేయగలరేమో తప్ప భైంసా ప్రజలనుంచి దూరం చేయలేరని వ్యాఖ్యానించారు.