తెలంగాణ సమాజంలో హైడ్రా ఒక హాట్ టాపిక్ గా నిలుస్తోంది. చెరువుల ఆక్రమణలను తొలగిస్తున్నామని చెబుతూ పెద్ద ఎత్తున ఇళ్ళు, భారీ నివాసాలను కూల్చి వేస్తున్నారు. ఇందులో చాలావరకు సామాన్యులు నివాసాలు ఉండడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
ముఖ్యంగా శని ఆదివారాలలో ఒకసారిగా విరుచుకుపడి నివాసాలను కూల్చివేస్తున్నారు. దీనిమీద తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైడ్రా అధికారుల తీరును హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసింది. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది.
హైకోర్టు విచారణకు స్థానిక తహసిల్దారు ప్రత్యక్షంగా హాజరయ్యారు అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరు అయ్యారు.
వాదనల సందర్భంగా తహసీల్దార్ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామని రంగనాథ్ హైకోర్టుకు తెలపడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తహసీల్దార్ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా? ఆయన చెబితే చార్మినార్, హైకోర్టును కూడా కూల్చేస్తారా? ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్ బాస్లను సంతృప్తిపరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు అంటూ హెచ్చరించింది.
ఈ సందర్భంగా న్యాయస్థానం సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించింది. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా? ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? అంటూ “అధికారులు చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు.. జాగ్రత్త” అని హైకోర్టు హెచ్చరించింది. పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయొద్దని హితవు చెప్పింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త అని మందలిస్తూ ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తారా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు పని తీరు మార్చుకోవాలని హితవు పలికారు.ఇదే విధం గా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందన్నారు. కూల్చివేతలు తప్ప వేరే పాలసి లేదని, ఇది ప్రజల అభిప్రాయమని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని.. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్ను గట్టిగా నిలదీసింది ధర్మాసనం. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని.. లేదా సీజ్ చేయాలని… కానీ నిబంధనలు ఉల్లగించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది. హైడ్రా కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకభవించలేదు.
రాజకీయ నాయకుల మెప్పు కోసం హైడ్రా చేస్తున్న ఓవర్ యాక్షన్ ను హైకోర్టు స్పష్టంగా మందలించింది. మరి ఇప్పుడైనా అధికారులు తీర్పు మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం.