జార్ఖండ్ రాజకీయాలు హీటెక్కాయి. సీఎం సోరెన్ శాసనసభ్యత్వంపై గవర్నర్ అనర్హత వేటు వేస్తే..ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్ జాగ్రత్తపడుతున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. తన ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రత్యర్థి పార్టీ బేరసారాలకు దిగిందని సోరేన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో ఆయన బస్సులో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సోరేన్ ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యేలు అక్కడినుంచే నేరుగా రెండు బస్సుల్లో రిసార్టులకు వెళ్లారు. వారు కుంతీ నుంచి చత్తీస్ గఢ్, బెంగాల్ వెళ్లే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సోరెన్ సర్కార్కు 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 30 మంది సభ్యులతో జార్ఖండ్ ముక్తి మోర్చా అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్కు 18 మంది, ఆర్జీడీకి ఓ ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోరెన్పై గవర్నర్ అనర్హత వేటు వేస్తే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. మధ్యంతర ఎన్నికలు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సొంతపార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డారు హేమంత్. ఇటీవలి మహారాష్ట్ర పరిణామాలు ఇక్కడా రిపీట్ అవుతాయేమోనని ఆయనభయపడుతున్నారు. అలా జరగకుండా ఉండేందుకు తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.
సీఎంగా ఉంటూ గనుల లీజును సోరెన్.. తనకు తానే కేటాయించుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈవ్యవహారం నిబంధనలకు విరుద్ధమంటూ రాజ్భవన్లో బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈసీ సైతం తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో రాజ్ భవన్ కు పంపింది.