ఉరుములతో కూడిన భారీ వర్షం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను ముంచేసింది.ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారత వాతావరణ శాఖ (IMD) దేశ రాజధానిలో ఎక్కువ వర్షాలు కురుస్తాయని ముందే అంచనా వేసింది. ఉదయం 5.40 గంటలకు 29 డిగ్రీల సెల్సియస్ ఉన్న వాతావరణం 11 డిగ్రీలు తగ్గి 7 గంటలకు 18 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది.
తుపాను ప్రభావంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో గోడలు కూలిన ఘటనలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ బులెటిన్లో ఢిల్లీ సహా పరిసర ప్రాంతాలలో గంటకు 50-80 కి.మీ.ల వేగంతో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం, ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. కిటికీలు, తలుపులు మూసివేయాలని.. వీలైతే ప్రయాణానికి దూరంగా ఉండాలని సూచించింది. ఉరుములతో కూడిన తుఫానులు నిర్మాణాలను కూడా దెబ్బతీస్తాయని పేర్కొంది.
వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం కారణంగా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయినట్లు ఎయిర్ పోర్ట్ ట్విట్టర్ వేదిగ్గా తెలిపింది. ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించి తదుపరి సమాచారం తెలుసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.