ఒడిశా రైలు ప్రమాదం యావత్ దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముందు ఓ రైలు పట్టాలు తప్పి బోగీలు పక్కకు ఒరగడం ఆ రైలును మరో ప్యాసింజర్ రైలు, గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రమాదంలో ఎనిమిది బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే దాదాపు 300 మంది చనిపోయినట్టు తెలిసింది. ఇంకా మరో వెయ్యిమంది వరకు క్షతగాత్రులు బాలాసోర్, కటక్ తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు కొనసాగుతున్నాయి.
పశ్చిమబెంగాల్ షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రాత్రి 7 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. 14 కోచ్ లు పట్టాలు తప్పి తిరగడ్డాయి. వాటిలో కొన్ని అక్కనే ఉన్న ట్రాక్ పై పడ్డాయి. అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న బెంగళూర్-హౌడా ఎక్స్ ప్రెస్ అక్కడ పడిఉన్న కోరమాండల్ కోచ్ లను ఢీకొంది. ఈ తాకిడికి బెంగుళూరు- హౌరా ఎక్స్ ప్రెస్ కు చెందిన నాలుగు బోగీలు కూడా పట్టాలు తప్పాయి. అదే సమయంలో వచ్చిన మరో గూడ్సు రైలు కూడా ఆ బోగీలను ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగి మృతుల సంఖ్య పెరిగింది.
ఘటన గురించి తెలిసిన కొద్దిసేపటికే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అక్కడికి చేరుకుని సహాయకచర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అక్కడిక్కడే చనిపోయిన వారిని తీవ్రంగా రక్తమోడుతున్న స్థితిలో ప్రయాణికులను చూసి నవీన్ పట్నాయక్ చలించిపోయారు.
ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు రైల్వే ఆదేశించింది.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్రమోదీ…ఒడిషా చేరుకున్నారు. ముందు కటక్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.సహాయచర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి ఘటనాస్థలానికి వెళ్లారు. తరువాత కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ ఆయన పరామర్శించారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఆయనతో పాటు ఉన్నారు.
ప్రమాదం జరిగిన రూట్లో 43 రైళ్లను రద్దు చేసిన రైల్వే…38 రైళ్లను దారిమళ్లించింది. ఇక రైలు ప్రమాద మృతులకు తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.మృతిచెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఇక ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏంటనే దానిపై రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఒక రైలు డీరైల్ అయిన వెంటనే సిగ్నలింగ్ సిస్టం ద్వారా సమీపంలోని రైల్వే స్టేషన్లకు అందాల్సిన సంకేతాలు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.సిగ్నలింగ్ సిస్టం లోని కీబోర్డులో రెండు రైళ్లు ఏక కాలంలో ప్రయాణిస్తుంటే సంబంధించిన సిబ్బంది పర్యవేక్షణ వంటి అంశాలు కూడా హైలెవల్ కమిటి మీటింగ్ లో చర్చకు వచ్చినట్టు తెలిసింది.