దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా మారుతున్నాయి. అధికారం కోసం అలవి కాని హామీలు ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇప్పుడు పరిపాలనలో చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న అప్పుల భారం అంతిమంగా ప్రజల మీద పడుతోంది. ఇది సమాజానికి ఏమాత్రం మంచిది కాదు అని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కొంతకాలంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూస్తూ వచ్చింది. దీంతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అన్న ఆత్రతతో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు విపరీతమైన ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. ఈ హామీల మోజులో పడిపోయిన ప్రజలు ఆయా రాష్ట్రాల్లో గెలుపుని ప్రసాదించారు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా తయారయింది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లలో దాదాపు ఒకే విధమైన పరిస్థితులు నెలకొన్నాయి.
దానితో ఎడాపెడా అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పలు రకాల చార్జీలు, పన్నుల భారం మోపక తప్పడం లేదు.
తాజాగా హిమాచల్ప్రదేశ్లో కనీసం వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనతో పాటు మంత్రులు, నామినేట్ పదవులలో కాబినెట్ హోదాలో ఉన్నవారు రెండు నెలల పాటు వేతనాలు, టీఏ, డీఏ వంటివి తీసుకోకూడదని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నామని ప్రకటించారు. పైగా, రాష్ట్రంలోని శాసనసభ్యులు కూడా ఇదే విధంగా చేయాలని అభ్యర్థించారు.
హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి అద్వానంగా తయారైంది.
కనీసం వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు. సీఎం తనతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎమ్మెల్యేలకు వేతనాలు ఇచ్చుకోలేనంతగా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని ఎద్దేవా చేశారు.
ఇక తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితులే కాబోతున్నాయి.
ఎన్నికల గ్యారెంటీల అమలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హస్తం పార్టీ ప్రభుత్వం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. మరోవైపు రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారు. రేవంత్ సర్కార్ కేవలం 8 నెలల్లోనే రూ.50 వేల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఒక్క కొత్త ప్రాజెక్టూ లేక, మరోవైపు ప్రజా సంక్షేమమూ లేక తెచ్చిన వేలాది కోట్ల అప్పులు ఎటు పోతున్నాయో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్నికల హామీలు నెరవేర్చలేక తిప్పలు పడుతున్నారు.
రుణమాఫీ అంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగ ఊదరగొట్టిన కాంగ్రెస్ రుణమాఫీని సక్రమంగా అమలు చేయలేక రైతన్నల ఆగ్రహాన్ని చవిచూస్తున్నది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కూడా అంతే పరిస్థితి. ఐదు గ్యారెంటీలను నమ్మి ఓటేసిన ప్రజలకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపిస్తున్నది. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. గ్యారెంటీలకు అడ్డగోలుగా కోతలు పెడుతున్నది. దీనికితోడుగా పెట్రోల్, డీజిల్పై సేల్స్ ట్యాక్స్ను 4 శాతం పెంచడంతో పాటు పలు రకాల పన్నులు, చార్జీలతో ప్రజలపై భారం వేస్తున్నది.
‘ఉచిత విద్యుత్తు’ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారని, మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న ‘గృహలక్ష్మి’ స్కీమ్కు కొత్త ఆంక్షలు జోడించారని, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన ‘శక్తి’ స్కీమ్లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారని, నిరుద్యోగులకు భృతి కల్పిస్తామన్న ‘యువనిధి’, పేదలకు ఉచిత బియ్యమన్న ‘అన్నభాగ్య’ ఇలా ప్రతీ స్కీమ్లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఖటా-ఖట్’ మాడల్ కారణంగానే రాష్ట్రాల్లో ఆర్థికంగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన విఫల ఆర్థిక ఆలోచనా విధానాలు బహిర్గతమయ్యాయని అంతా విమర్శిస్తున్నారు. అనేక చోట్ల ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయని, పాల నుంచి నీళ్ల వరకు అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయని ధ్వజమెత్తారు. నకిలీవాగ్దానాలు చేసిన రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడింది అని మండిపడుతున్నారు.