దేశం మొఘలుల పాలనలో ఉన్న సమయంలో గోవా పోర్చుగల్ పాలన కిందకు వెళ్లిందని… అయితే ఇన్నేళ్లైనా గోవా భారతీయతను మర్చిపోలేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గోవా విమోచన ఉత్సవాల సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. గోవా విముక్తి పోరాటంలో పాల్గొన్నవారిని సన్మానించారు. పటేల్ ఇంకొంత కాలం జీవించి ఉంటే గోవాకు ముందుగానే స్వాతంత్య్రం వచ్చి ఉండేదని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ ఇటీవల తాను ఇటలీ, వాటికన్ సిటీ పర్యటనకు వెళ్లినప్పుడు పోప్ను కలిసే సందర్భం వచ్చిందని, అప్పుడు భారత్లో పర్యటించాలని ఆయన్ను ఆహ్వానించానని పేర్కొన్నారు. తన ఆహ్వానం తనకు అద్భుతమైన కానుక అని పోప్ ఆనందం వ్యక్తం చేశారని మోదీ గుర్తు చేసుకున్నారు.
సుపరిపాలనతో పాటు ఇతర అంశాల్లో గోవా ప్రగతి చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు.
దివంగత సీఎం మనోహర్ పారికర్ ప్రవర్తన ద్వారా గోవా ప్రజలు ఎంత నిజాయితీపరులో, ప్రతిభావంతులో, ఎలా కష్టపడుతారో దేశం మొత్తం చూసిందని….తుదిశ్వాస వరకూ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజలకోసం పనిచేసిన నాయకుడు పరికర్ అని కొనియాడారు.
నూరుశాతం తొలివిడత వ్యాక్సినేషన్ పూర్తిచేసిన ఘనతను గోవా సాధించిందని…గోవా అభివృద్ధి కోసం సీఎం ప్రమోదా సావంత్ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారని ప్రధాని అన్నారు.