హర్యానా సీఎం కట్టర్ చేపట్టిన ‘మిషన్ వచన్’ కింద 182 కశ్మీరీ పండిట్ కుటుంబాలు 30 ఏళ్ల తరువాత భూ యాజమాన్య పత్రాలు పొందాయి. 1991 నుంచి 1993 మధ్య రాష్ట్రంలోని ఝుజ్జర్ జిల్లాలోని బహదూర్ ఘర్లోని సెక్టార్-2 లో కొనుగోలు చేసిన భూ యాజమాన్యాన్ని పొందారు వాళ్లు. రెండు నెలల క్రితం ఇదే విషయాన్ని పరిశీలించాల్సిందిగా కశ్మీర్ పండిట్ల ప్రతినిధి బృందం హర్యానా డెవలప్ మెంట్ అథారిటీ హుడా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అజిత్ బాలాజీని కలిసింది. దీంతోఆయన బహదూర్ ఘర్ ఎస్టేట్ ఆఫీసర్ శ్వేతా సుహాగ్ కు చెప్పారు. దీంతో ఆయన అన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులనూ తొలగించి వారికి ప్లాట్ల కేటాయింపునకు మార్గం సుగమం చేశారు. మూడు రోజుల క్రితం మిషన్ వచన్ పూర్తి కార్యక్రమాన్ని ప్రకటించి ఆ 182 కుటుంబాల వాళ్లకు ప్లాట్ల లేఖలు అందజేశారు.
హర్యానా చరిత్రలో ఈరోజు చరిత్రాత్మకమైన దినం అని…. 1991-1993 మధ్య కాంగ్రెస్ హయాంలో భూములు కొన్న కశ్మీరీ పండిట్ల కుటుంబాల నిరీక్షణ ఫలించిందని… వారికి యాజమాన్య హక్కులు అందాయని… కొన్ని సవరణలు చేసి వారికి ఆ ప్లాట్లు కేటాయించామని చెప్పారు.
30 ఏళ్లక్రితం 209 కుటుంబాలు ఆ ప్రాంతంలో పదెకరాల భూమి కొనుగోలు చేశాయి. సెక్టార్-2ను అభివృద్ధి చేసేందుకు హర్యానా అర్బన్ లోకల్ డెవలప్మెంట్ అథారిటీస్ (హుడా) భూమిని సేకరించినప్పుడు, కశ్మీరీ పండిట్ల భూమి కూడా అందులోకి వెళ్లింది. అయితే భూసేకరణ నుంచి తమకు విముక్తి కల్పించాయని అప్పుడు వారు విజ్ఞప్తి చేశారు. అయితే 1997లో 209 కుటుంబాలకు 10 ఎకరాల భూమిని ఇవ్వడం సాధ్యం కాకపోవడంతో 12 ఎకరాల భూమిని విడుదల చేసేందుకు అధికారులు అంగీకరించారు. 2016లో 27 కుటుంబాలకు మాత్రమే ప్లాట్లు కేటాయించగా.. మిగతావారు నాటినుంచీ ఎదురుచూస్తూనే ఉన్నారు.
ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కశ్మీరీ పండిట్ కుటుంబాలకు 5 వేల రూపాయల ఆర్థికసాయాన్ని నిలిపేసిందని ఆరోపిస్తున్న విపక్షాలకు ఈ మిషన్ వచన్ పూర్తి తగిన సమాధానం అని కట్టర్ ఈ సందర్భంగా అన్నారు.
అంతేకాదు కశ్మీరీలకు 5 వేలు ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించిందని…తమ ఐదేళ్ల హయాంలో ఆ మొత్తాన్ని అందజేస్తామని హామీ ఇచ్చిందని కట్టర్ గుర్తు చేశారు. ఆ సాయం కూడా కేవలం ఒక్క కుటుంబానికే అందిందన్నసీఎం…ఇంకా వాళ్ల ఐదేళ్ల కాలం పూర్తి కానట్టుందని ఎద్దేవా చేశారు. లోయ నుంచి కశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా విజయాన్ని జీర్ణించుకోలేకే విపక్షాలు తమ ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)