బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసినందుకు ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు అన్నారు. అయితే ఎందుకు సస్పెండ్ చేసినట్టో చెప్పాలన్నారు. దొరలగడీలనుంచి బయటకు వచ్చినట్టు ఫీలవుతున్నానని అన్నారు. అంతకుముందు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చిన ఆయనను అసెంబ్లీ భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. స్పీకర్ అనుమతి లేదని చెప్పారు. ఇక ఖమ్మం రాజకీయాలు కాక రేపుతున్నాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అసంతృప్త నేతలు ఏకతాటిపైకి వస్తారన్న జూపల్లి, పొంగులేటి వ్యాఖ్యల్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇద్ద్దరినీ పార్టీనుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఈ ఇద్దరు నేతలు కూడా అనుచరులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
కొంతకాలంగా పొంగులేటి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. కేసీఆర్ పైనా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అయినా అధిష్టానం ఆయన్ని వారించలేదు. కానీ ఆయన మద్దతుదారులపై వేటువేసింది. అదే సమయంలో పలుమార్లు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ క్రమంలో నిన్నటి ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలను పార్టీ సీనియర్ గా తీసుకుంది. అందుకే ఆయనతో పాటు జూపల్లి కృష్ణారావునూ సస్పెండ్ చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.