శిశుమందిర్ పాఠశాలలో చదువుకోవడం వల్లనే విలువల తో కూడిన విద్యను అందుకున్నట్లు హనుమాన్ సినిమా దర్శకులు ప్రశాంత్ వర్మ వెల్లడించారు. శిశు మందిర్ లో విద్యతోపాటు అనేక అంశాల్లో శిక్షణ ఇస్తారని,, జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకునేందుకు ఇవన్నీ ఉపయోగపడతాయని ఆయన వివరించారు. హైదరాబాద్ లోని మాధవ నగర్ సరస్వతీ శిశు మందిర్ లో 2003-04 సంవత్సరం పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు దాదాపు 20సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను, జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. ఇక్కడ చదవిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు. నాడు తమకు విద్యాబుద్దులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాద్యాయులు మాట్లాడుతూ 20 సంవత్సరాల తరువాత తమను పిలించి ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం, ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాఠశాల అకాడమిక్ ఇంఛార్జి పి.ఆశ మాట్లాడుతూ పట్టుదల, క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యాబోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థి హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు
కె వంశీకృష్ణ, బి శ్రావణి,ఎన్ ప్రత్యుష ,హరికృష్ణ, హరిప్రియ ఇంకా జి దినేష్ తదితరులు సందడి చేశారు.