హిజాబ్ వ్యవహారం తగ్గుముఖం పట్టిందో లేదు హలాల్ అంశం తెరమీదకు వచ్చింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని కర్నాటకలోని హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హలాల్ అనేది ఆర్థికపరమైన జిహాద్ అన్న తన వ్యాఖ్యను ఆయన సమర్థించుకుంటూనే ముస్లింలు తమ వ్యాపార ప్రయోజనాలు కాపాడుకుంటున్నారని…హిందువులకూ ఆ హక్కు ఉందని అన్నారు. ముస్లింలు దృఢంగా ఉంటే హిందువులు కూడా కఠినంగా ఉంటారని, ‘హలాల్’ మతపరమైన విభజన అని..ఎవరి ప్రయోజనాల కోసం వారు పనిచేస్తే సమస్యేముందని ఆయన అన్నారు. హలాల్ పేరుతో వాళ్లు తమ ఎజెండాను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లు ఉదారవాదులైతే మనం కూడా అవుతామనీ అన్నారు.
అటు హలాల్ పై ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కూడా స్పందించారు. హలాల్ మాంసం పై తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయని… దానిని అధ్యయనం చేస్తామని అన్నారు.
అటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే బీజేపీ ఇలాంటి మతపరమైన అంశాలను వివాదాస్పదం చేస్తోందని కర్ణాటక విపక్షాలు ఆరోపిస్తున్నాయి. చాలా ప్రగతిశీల రాష్ట్రమైన కర్ణాటకను ఎన్నికల వ్యూహంలో భాగంగా ఉత్తరప్రదేశ్గా మార్చాలని బీజేపీ భావిస్తోందని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే మండిపడ్డారు. బీజేపీకి ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి సమస్యలు లేవని, అందుకే ‘ది కాశ్మీర్ ఫైల్స్’, మైనారిటీల ఆర్థిక కార్యకలాపాలపై నిషేధం, ఇప్పుడు హలాల్ మాంసాహారం వంటి అంశాలను తెస్తున్నారని ఆయన అన్నారు.
హిందూ జాగృతి సమితి, శ్రీరామ సేన, బజరంగ్ దళ్ సహా ఇతర హిందూ సంఘాలు మాంసం విక్రయించే దుకాణాల సైన్ బోర్డుల నుంచి హలాల్ సర్టిఫికేషన్ను తొలగించాలని పిలుపునిచ్చాయి. హిందూ సాంప్రదాయ పద్ధతి(ఝట్కా)లో కోసిన మాంసాన్ని మాత్రమే హిందువులు కొనుగోలు చేయాలని కోరారు.