ప్రపంచంలోని వివిధ దేశాలలో భారతీయుల విలువల దిశగా పనిచేస్తున్న హిందూ స్వయంసేవక్ సంఘ్..
మరో సాంప్రదాయక కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికాలోని మేరీ ల్యాండ్ ప్రాంతంలో గురువందన కార్యక్రమాన్ని చేపట్టింది. అనేక సంవత్సరాలుగా అమెరికాలోని వివిధ ప్రాంతాలలో గురువందన నిర్వహిస్తున్నారు. గురు వందన కార్యక్రమంలో చుట్టుపక్కల ఉండే పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులను తీసుకొని వచ్చి సత్కరించడం జరుగుతుంది . వివిధ దేశాలకు చెందిన గురువులను పిలిపించి పాదపూజ నిర్వహిస్తారు. గురువులను ఆత్మీయంగా సత్కరించి ఆశీస్సులు అందుకుంటారు.
హిందూ స్వయంసేవక్ సంఘ్, మేరీ ల్యాండ్ విభాగం నిర్వహించిన గురువందన కార్యక్రమం ఆత్మీయ వాతావరణం లో కొనసాగింది. హోవర్డ్ కౌంటీ, మాంటెగ్ మేరీ, ఫ్రెడ్ రిక్ కౌంటీ వంటి ప్రాంతాలకు చెందిన 40 మందికి పైగా అధ్యాపకులను ఆహ్వానించారు. పిల్లలు పెద్దలు అంతా కలిసి ఆచార్యులను సత్కరించారు. సాంప్రదాయ సంగీతం కొనసాగిస్తుండగా పువ్వులు చందనంతో గురుపూజ చేపట్టారు. సుమారు 150 పైగా కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. భారతీయ మూలాలు కలిగిన ఎన్నారైలు ఈ గురువందనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి అధ్యాపకుల్ని సత్కరించి గౌరవించారు.
హిందూ స్వయంసేవక్ సంఘ్, మేరీల్యాండ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రిచా అగర్వాల్,, శ్రేయస్ తదితరులు అతిథులుగా విచ్చేశారు. భారతీయ సాంప్రదాయంలో ఉన్న గొప్ప విలువల గురించి విశ్లేషించారు. గురువందన వంటి కార్యక్రమాల ద్వారా గురువుల్ని పూజించుకోవడం,,, తద్వారా జీవితంలో విలువలు పాటించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పిల్లల్లో పెద్దవారిపట్ల గౌరవ ప్రపత్తులు కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగిస్తాయని ఆకాంక్షించారు.
గురు వందన కార్యక్రమం పూర్తి సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ప్రారంభంలో ప్రార్థన నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. శాస్త్రీయ సంగీతం ద్వారా సంప్రదాయ కళల్ని ప్రదర్శించారు. కూచిపూడి భరతనాట్యం వంటి సాంప్రదాయ రీతుల్ని బాలికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు అయిన దర్శన ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమం చివర్లో అన్ని ప్రాంతాలు సుఖంగా ఉండాలని కోరుకుంటూ శాంతి మంత్రం పఠించారు. ఈ కార్యక్రమం పట్ల స్థానిక అమెరికన్ పౌరులు ఆనందం వ్యక్తం చేస్తూ సంఘీభావం తెలిపారు.