విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను సదా గుర్తించుకోవాలి. అటువంటి మహనీయుల సేవలను ఎప్పటికప్పుడు సమాజంలో తెలియ చేస్తూ ఉండాలి. అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని ధర్మేందర్ సింగ్ అనే టీచర్ సేవలను పూర్వ విద్యార్థులు ఎప్పటికప్పుడు తలచుకుంటూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా లోని అనేక పాఠశాలల్లో ధర్మేందర్ సింగ్ గణితం ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. ప్రతీ పాఠశాలలోనూ తనదైన శైలిలో ముద్ర వేస్తూ.. విద్యా బోధన చేస్తూ వచ్చారు. అనుకోని సంఘటనతో ఆయన మరణించినప్పటికీ, విద్యార్థుల మనస్సుల్లో మాత్రం శాశ్వతంగా నిలిచే ఉన్నారు.
తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక స్కూల్స్ లో ధర్మేందర్ సింగ్ జ్నాపకార్థ కార్యక్రమాలు జరిగాయి. ఖాల్సా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. అదిలాబాద్ జిల్లాలోని బోథ్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల ధన్నూరు,జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సోనాల మండల కేంద్రములో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. పరీక్షలకు ఎలా సిద్ధం అవ్వాలి, మానసిక ఒత్తిడి నుండి ఏ విధంగా దూరంగా అవ్వాలి, ఏ విధంగా చదవాలి ,ఏకాగ్రత పెంపొందించుకునే విధానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు సేవాసింగ్ మాట్లాడుతూ పరీక్షల్లో మెళకువలు, రాసే విధానము,ఆరోగ్యంగా ఉంటూ పరీక్షలకి ఎలా సిద్దము అవ్వాలి అనే దాని గురించి విద్యార్థులకి వివరించారు. బోథ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రస్తుతం పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు చరవాణికి దూరంగా ఉండాలి అని గుర్తు చేశారు. అలాగే మానసిక ఒత్తిడి దూరం అయ్యేలా ధ్యానం తప్పని సరిగా చేయాలి అని వివరించారు. అనంతరం ధర్మేందర్ సింగ్ దగ్గర చదువుకొన్నపూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రస్తుత పదో తరగతి స్టూడెంట్స్ కి..పరీక్షా ప్యాడ్ లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సోనాల తహసిల్దార్ మల్లేష్,ఎంపీడీవో రాజేశ్వర్, జిల్లా పరిషత్ పాఠశాల సోనాల ప్రధానోపాధ్యాయులు సచిన్ దేశ్ ముఖ్,ఉపాధ్యాయులు ఓస శ్రీనివాస్, నర్సయ్య, ఖాల్సా ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు సోహన్ సింగ్,పురుషోత్తం, పూర్వ విద్యార్థులు తుల అజయ్, మునిగెల శ్రీధర్, చెట్లపెల్లి సుధీర్,గ్రామస్తులు బోరే రవీందర్, కచ్చకాయల హరీష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.