తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాడన్న వార్తల్ని ఖండించాడు గుజరాత్ కాంగ్రెస్ యువనేత హార్దిక్ పటేల్. అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని ఎవరు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని వాపోయారు. పార్టీ కోసం నూరుశాతం శ్రమించానని, ఇకముందూ అలాగే కష్టపడతానని చెప్పుకొచ్చాడు. పార్టీలో చిన్న చిన్న గొడవలు, పరస్పర ఆరోపణలు సహజమని అన్నాడు. గుజరాత్ ను ఉత్తమంగా తీర్చిదిద్దడం కోసం పార్టీలో అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూరత్ లో జరిగిన ఓ కార్యక్రమం వేదిగ్గా కార్యకర్తలకూ హార్దిక్ పిలుపునిచ్చారు.
2019లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే పేరుకు ఓ పదవినిచ్చినా తనకు తగిన విలువ ఇవ్వడం లేదని కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు తనను పట్టించుకోవడం లేదని..తనను సంప్రదించకుండా రాష్ట్ర పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. కొత్త పెళ్లికొడుక్కి వెసెక్టమీ చేయించినట్టుందని తన పరిస్థితి అని తాజాగా వ్యాఖ్యానించారు హార్దిక్.
ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే పార్టీలో అసమ్మతి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అంతర్గతకుమ్ములాటలు ఎక్కువయ్యాయి. తాజాగా హార్దిక్ పటేల్ తీరు పార్టీకి అసహనం తెప్పిస్తోంది. నిన్నటి వ్యాఖ్యల నేపథ్యంలో హార్దిక్ బీజేపీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. పటేల్ సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్యులను పార్టీలోకి రాకుండా హార్దిక్ అడ్డుకుంటున్నారు.