భారతదేశంలో సంఘ్ విస్తరణ అంతకంతకు పెరుగుతోంది. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో సంఘ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్లో Join RSS అన్న లింక్ ద్వారా వేల సంఖ్యలో యువత చేరుతున్నారు.
దేశం కోసం సమాజం కోసం పనిచేసేందుకు యువత ముందుకు రావడం మంచి పరిణామం అని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ జీ అభిప్రాయపడ్డారు. రాంచీలోని సరళా బిర్లా యూనివర్శిటీ క్యాంపస్లో అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ జూలై 12, 13, 14 తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహించినట్లు తెలిపారు. పరస్పర చర్చల కోసం వివిధ సంస్థల సమన్వయ సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీలలో కేరళలోని పాలక్కాడ్లో జరుగుతుందని వెల్లడించారు.
దేశంలోని యువత సంఘ్లో చేరాలని ఆకాంక్షిస్తున్నారని, పెద్దఎత్తున చేరుతున్నారని అన్నారు. సంఘ్ 2012లో ఆర్ఎస్ఎస్లో చేరండి అనే ఆన్లైన్ మాధ్యమాన్ని ప్రారంభించింది. ప్రతి యేటా 1.25 లక్షల మంది ఆన్లైన్ మాధ్యమం ద్వారా సంఘ్ చేపట్టే వివిధ కార్యకలాపాలలో పాల్గొంటున్నారు. ఈ ఏడాది కూడా జూన్ నెలాఖరు నాటికి 66,529 మంది సంఘ్లో చేరేందుకు సంప్రదించారని తెలిపారు.
ఈ ఏడాది నుంచి సంఘ్ శిక్షణ తరగతుల కూర్పు, పాఠ్యాంశాల్లో మార్పులు చేశామని, ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 72 తరగతులు (సంఘ్ శిక్షా వర్గ – 60, కార్యకర్త వికాస్ వర్గ I – 11, కార్యకర్త వికాస్ వర్గ II – 1) నిర్వహించబడ్డాయని, ఇందులో మొత్తం 20,615 మంది శిక్షణ పొందారన్నారు. 40 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల కోసం నిర్వహించిన 18 తరగతులలో 3,335 మంది అభ్యాసకులు పాల్గొన్నారు. గతేడాది నిర్వహించిన ప్రాథమిక విద్యా తరగతుల్లో కొత్తగా లక్ష మంది శిక్షణ పొందారు. అదేవిధంగా, మొదటిసారిగా సామాన్య స్వయం సేవకులకు దేశవ్యాప్తంగా ప్రారంభిక్ తరగతులు (మూడు రోజులు) నిర్వహించబడుతున్నాయని, ఇందులో ప్రాథమిక వాటితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో యువత పాల్గొంటున్నారని చెప్పారు.
2025 విజయదశమి (100 సంవత్సరాలు పూర్తి) నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని డివిజన్లలో మరియు పట్టణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో సంఘ్ పనిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సునీల్ అంబేకర్ చెప్పారు. మార్చి 2024 నాటికి, దేశంలో దాదాపు 58,981 మండలాలు ఉన్నాయని, 36,823 మండలాల్లో దైనిందిన శాఖలు నడుస్తున్నాయని, మిగిలిన మండలాల్లో వారం వారం సమావేశాలు లేదా నెలకొకసారి సమావేశాల రూపంలో సంఘ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. నగరాల్లోని బస్తీల విషయానికొస్తే, 23,649 బస్తీలు ఉన్నాయని, వీటిలో 14,645 బస్తీలలో సంఘ్ కార్యం నిర్వహింపబడుతోందని వివరించారు. ప్రస్తుతం, దేశంలో 73,117 రోజువారీ శాఖలు మరియు 27,717 వారపు సమావేశాలు నడుస్తున్నాయి. ఇది కాకుండా, శాఖా పని లేదా పరిచయం లేని 1,58,532 గ్రామాల్లో జాగరణ్ పత్రికల ద్వారా ప్రజలకు సానుకూల సందేశాలు, ఆధ్యాత్మిక చింతనలు, సాధువుల సందేశాలను పంచుతోందని, 15 రోజుల్లో దేశంలోని 6.6 లక్షల గ్రామాలకు స్వయం సేవకులు చేరుకుని శ్రీరామ జన్మభూమి అక్షతల పంపిణీ చేశారని తెలిపారు.
మొత్తం మీద రాగల కాలంలో లక్ష గ్రామాలకు సంఘ్ కార్యం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా సంఘ్ విస్తరణ సాగుతోంది.