పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ పై జరిగినదాడి కలకలం రేపుతోంది. తరన్ తరన్ పీఎస్ పై శుక్రవారం అర్థరాత్రి రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ విసిరారు దుండగులు. అది స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి తగలడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది. ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ దాడి జరిగిన సమయంలో ఈ పోలీస్ స్టేషన్లో 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటన వెనక ఖలిస్థాన్ మద్దతుదారుల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతోనే ఈ దాడికి కుట్ర చేసినట్టు భావిస్తున్నారు. గ్యాంగ్స్టర్, ఖలిస్థానీ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ వురపు రిండా ఇటీవల పాకిస్థాన్లో హత్యకు గురయ్యాడు. అందుకు ప్రతిస్పందనగానే ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. పంజాబ్లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచడం కోసం పాకిస్థాన్ ఐఎస్ఐ ఈ దాడి చేయించి ఉండవచ్చంటున్నారు.
పంజాబ్లోని మొహాలీలో పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై ఆర్పీజీ దాడి కేసులో రిండా ప్రధాన సూత్రధారి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా రిండాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనేక ఉగ్రవాద కేసుల్లో రిండా నిందితుడు. ఆయన నిషిద్ధ ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు కూడా.