తెలంగాణలో దీపావళికి టపాసులు కాల్చేందుకు వీల్లేందంటూ టీఎస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. అయితే దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 వరకు టపాసులు కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు కాస్త ఊరట లభించింది. మొదట కరోనా వైరస్ నేపథ్యంలో క్రాకర్స్ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతినిచ్చింది. గాలినాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తించనున్నాయి. కాలుష్యం సాధారణంగా ఉంటే 2 గంటలపాటు టపాసులు కాల్చుకునే అవకాశం ఉంది. అయితే కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతంలో బాణాసంచా పూర్తిగా నిషేధించారు. అయితే దీపావళితో పాటు క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకలకు కూడా ఈ తీర్పు వర్తించనుంది. మొత్తానికి హైకోర్టు ఆదేశాలను సవరిస్తూ ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు సవరించింది.