ఎంత ఎత్తుకు ఎదిగినా, మూలాలు మర్చిపోకూడదు అని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతి మూలాలు ఎంతో గొప్పవని ఆయన వివరించారు. హైదరాబాద్ శిల్పారామం లో లోక్ మంథన్ కార్యక్రమం ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు.
మొదటగా రాయ గజ కేసరి బిరుదాంకితురాలు రాణిరుద్రమదేవి సింహాసనం ఆవిష్కరణ చేసి, లోకమంతన్ ఎగ్జిబిషన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా చత్తీస్గడ్ నుండి వచ్చిన కళాకారుల బృందం ప్రార్ధన గీతం ఆలపించారు. వెంకయ్య నాయుడుగారు “గో బ్యాక్ టూ రూట్స్ “ అంటూ మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని చెప్పారు. అలాగే ..సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, సూర్యనమస్కారాలు, యోగా సాధన చేయడం వంటి మంచి అలవాట్లని పాటించాలని సూచించారు. మాతృభాష విశిష్టతను, దానిలో దాగి ఉండే అమ్మతనాన్ని, దానిలో నిండిన మాధుర్యన్ని మరవకూడదని తెలిపారు.
పరదేశీయుల దండయాత్రలు, అంగ్లేయుల అరాచక పాలనతో, మన మూలాలను పెకిలించే ప్రయత్నం జరిగిందని, ఆంగ్లేయులు మనని వదిలి వెళ్ళినా వారి సంస్కృతిని మన నిత్యజీవితంలో మనకు తెలియకుండానే ఇమిడి ఉంచారని, యువతరం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి పాశ్చాత్య పోకడలకు పోకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నేడు ప్రదర్శించిన సాంస్కృతిక కళాకారులను చూస్తూంటే చాలా సంతోషంగా ఉందని వెంకయ్య అన్నారు.
ఈ కార్యక్రమం శిల్పారామంలోని సంప్రదాయ వేదికలో జరిగింది. ఈ కార్యక్రమం లో కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి; రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్ నంద కుమార్, ప్రజ్ఞ భారతి ఛైర్మన్ డా. T. హనుమాన్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.