74వ గణతంత్ర దినోత్సవాన్ని దేశప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ రాజధానిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. కర్తవ్యపథ్ లో వేడుకలు నిర్వహించారు. ఈసారి వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్లా ఫతా అల్ సీసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు సహా పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి త్రివిధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు కవాతు సాగింది. ఈసందర్భంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాల ప్రదర్శన సాగింది. ఈసారి రక్షణశాఖ శకటాలు ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ శకటం ఆకర్షణగా నిలిచింది. శకటంపై కోనసీమ ప్రబలతీర్ధం, సంక్రాంతి వేడుకను ప్రతిబింబించే దృశ్యాలు అలరించాయి. ఈసారి మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తూ శకటాలు రూపొందించారు. ముఖ్యంగా తమిళనాడు, కర్నాటక శకటాలు నారీశక్తిని ప్రమోట్ చేస్తూ నిలిచాయి. ఈసారి పరేడ్ లో తెలంగాణ శకటం లేదు. 45 వేల సందర్శకులు ఈ సారి పరేడ్ ను ప్రత్యక్షంగా తిలకించారు.