టిఆర్ ఎస్ కు “పట్టభద్రుల” పరీక్ష
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎంఎల్ సిలు ముగ్గురూ మూడు పార్టీలకు చెందిన వారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం బిజెపి నాయకుడు రామచంద్రరావు ఎం ఎల్ సిగా ఉన్నారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి కూడా ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి (టిఆర్ ఎస్) సిట్టింగ్ ఎం.ఎల్.సి. ఇక కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ నియోజకవర్గ ఎం ఎల్ సిగా ఇది వరకే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలిచారు. అక్కడ 2019 మార్చి నెలలో ఎన్నిక జరిగింది.
ప్రధానంగా హైదరాబాద్ సీటుగా పిలిచే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఈసారి పోటీ మింత తీవ్రంగా ఉండొచ్చు. సిట్టింగ్ ఎంఎల్ సి రామచంద్ర రావు మరోసారి బిజెపి నుంచి పోటీ చేయడం ఖాయం. అధికార టిఆర్ ఎస్ శిబిరంలో అనేక పేర్లు వినిపిస్తున్నాయి. ఒక దశలో హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మాజీ ఎంఎల్ సి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈసారి మళ్లీ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తరఫున కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మరికొందరి పేర్లు వ్యాప్తిలో ఉన్నాయి. దుబ్బాక, జిహెచ్ ఎంసి ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు బిజెపి జోరు మీదుంది. అయిదే నాగేశ్వర్ ఈసారి పోటీ చేయడం రామచంద్ర రావుకు గట్టి సవాలు కావచ్చు. ఆయనకు టిఆర్ ఎస్ నుంచి పరోక్ష మద్దతు కూడా లభించ వచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ అభ్యర్థి, ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీ ప్రసాద్ పై రామచంద్ర రావు 13,318 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బిజెపి 53,881 ఓట్లు, టిఆర్ ఎస్ 40,563 ఓట్లు పొందాయి. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2,856 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎంఎల్ సి గా క్రితం సారి టిఆర్ ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు బిజెపి గట్టి పోటీ ఇచ్చింది. మొదటి ప్రాధాన్య ఓట్లలో పల్లా 59,764, బిజెపి అభ్యర్థి రాంమోహన్ రావు 47,041, కాంగ్రెస్ టికెప్ పై పోటీ చేసిన జర్నలిస్టు తీన్మార్ మల్లన్న13,033 ఓట్లు పొందారు. ఈసారి పల్లా పోటీకి సిద్ధమయ్యారు. ఆయన్ని ఢీకొనే బిజెపి అభ్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. జర్నలిస్టు తీన్మార్ మల్లన్న మాత్రం సుమారు రెండు నెలలుగా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర పూర్తి చేశారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. పల్లాపై చాలా మంది టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా వారికి మంత్రి కెటిఆర్ ఇటీవల నచ్చజెప్పారు.
ఈ రెండు పట్టభద్రుల ఎన్నికల్లో గెలవడం టిఆర్ ఎస్ కు ప్రాణావసరం. ఈ ఫలితాల వల్ల కెసిఆర్ ప్రభుత్వంపై ప్రభావం పడదు. కానీ ఒక వేళ ఓడిపోతే బిజెపి మరింత దూకుడుగా టిఆర్ ఎస్ పై విమర్శల దాడిచేస్తుంది. ఇక, రామచంద్ర రావును మరోసారి గెలిపించుకోవడం బిజెపి ముందున్న సవాలు.