వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోయిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగింది తెలంగాణ సర్కారు. కుటుంబనియంత్రణ ఆపరేషన్లు నిర్వహిస్తున్న శిబిరాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆగస్టు 25న 34 మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు.వారిలో నలుగురు మహిళలు మృతి చెందగా..పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మహిళల మృతి ఘటనలో పోస్ట్ మార్టమ్ రిపోర్టుతో పాటు నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకు తాత్కాలికంగా క్యాంపులు నిలిపేస్తున్నట్టు అధికారులు అన్నారు. నివేదికను బట్టి భవిష్యత్తులో క్యాంపుల నిర్వహణపై నిర్ణయం ఉంటుందని తెలిపారు.