తెలంగాణ గవర్నమెంట్, గవర్నర్ మధ్య వార్ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రభుత్వం రాజ్ భవన్ కు కనీస మర్యాద ఇవ్వడం లేదని… రాజ్యాంగపదవిలో ఉన్న తన విషయంలో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని ఏకంగా మీడియా ఎదుటే గవర్నర్ ఆరోపించిన సంగతి తెలిసింది. ఇటీవల మేడారం, యాదాద్రి పర్యటనల సందర్భంగా ఆలయ ఈవో, సంబంధిత మంత్రులు సైతం లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. అది క్రమంగా రెండు వ్యవస్థలమధ్య వివాదంగా మారింది.
అయితే గవర్నర్ వ్యాఖ్యల్ని అధికార పార్టీ కొట్టేస్తూ వస్తోంది. తాజాగా గవర్నర్ విమర్శలపై స్పందించారు దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. గవర్నర్ తన పర్యటన గురించి 10 నిమిషాల ముందు చెబితే ఎలా ఏర్పాట్లు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉన్న గవర్నర్ తో ఎలాంటి ఇబ్బందీ కలగలేదని…ఈ గవర్నర్ హుందాగా మెదిలితే బాగుటుందని అయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం ఆ పదవిలో ఉన్న వారికి ఎలాంటి మర్యాద ఇవ్వాలో తమకు తెలుసని…గవర్నరే బీజేపీవైపు చూస్తున్నారని… ఆమె మాటలు, విమర్శల్ని ఎవరూ పట్టించుకోరని ఇంద్రకరణ్ అన్నారు.
రెండు రోజుల డిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో ఆమె భేటీ అయ్యారు. అక్కడే మీడియా ఎదుట ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించినా భరిస్తానని..కానీ వ్యవస్థకు కనీసం గౌరవం ఇవ్వకుంటే ఎలా అని వాపోయారు. గతవారం ఉగాది వేడుకల సందర్భంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారామె. ఉగాది వేడుకలకు ఆహ్వానించినా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు రాలేదని… ప్రగతిభవన్ నుంచి తనకు ఆహ్వానం వస్తే తప్పక వెళ్లేదాన్నని తాను ఫ్రెండ్లీ గవర్నర్ ని అని ఆమె అన్నారు.
ప్రోటోకాల్ పాటించలేదని గవర్నర్ అంటుంటే ఆమెపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. గతంలో బీజేపీలో పనిచేసిన తమిళిసై గవర్నర్ అయ్యాక కూడా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ సైతం ఆరోపించిన సంగతి తెలిసిందే.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)