పుదుచ్చేరిలో టార్గెట్ గవర్నర్!
ఈ ఏడాది ఏప్రిల్ – మేనెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష అన్నాడీఎంకే కన్నా ఎక్కువగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని టార్గెట్ చేస్తున్నది. స్వయంగా ముఖ్యంమంత్రి నారాయణ స్వామి నాలుగు రోజులుగా రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. కిరణ్ బేడీని తొలగించాలంటూ మంత్రులు, నాయకులు కార్యకర్తలు ఆందోళ చేస్తున్నారు.
త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రజల సొమ్ము ద్వారా ఓటుకు నోటు కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నందుకే ఆమెను బద్నాం చేస్తున్నారనే వాదన ఉంది. ఉదాహరణకు పొంగల్ పండుగ పేరు మీద భారీగా ప్రజలకు కానుకలు ఇవ్వాలని సీఎం నారాయణ స్వామి ప్లాన్ చేశారు. ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువైన పొంగల్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇందుకు సమ్మతించలేదు. కేవలం 200 రూపాయల కానుకలు పంచడానికి అనుమతిచ్చారు. దీంతో సీఎంకు కోపం వచ్చింది. ఇలాంటి అనేక ఘటనలు కిరణ్ బేడీ నిజ స్వరూపాన్ని నిరూపించాయంటున్నారు సీఎం.
పుదుచ్చేరి పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. కేంద్ర పాలిత ప్రాంతం. ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలతో పోలిస్తే అనేక విషయాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్.జి)కు అధికారాలకు ఎక్కువ. చాలా విషయాల్లో ఎల్ జి అనుమతి అవసరం అవుతుంది. కిరణ్ బేడీ ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమంత్రికి నచ్చడం లేదు. తాను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని కాబట్టి ఎల్జీ పెత్తనం ఏమిటని ఆయన భావిస్తున్నారు. కానీ ఆయన ఇలా రెండో సారి ఆందోళన బాట పట్టినా కేంద్రం కిరణ్ బేడీని లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి తప్పిస్తుందా అనేది ప్రశ్న.