మతమార్పిడి నిరోధక బిల్లు ప్రవేశపెట్టడానికి కర్నాటక సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు న్యాయశాఖ ముసాయిదాను సైతం సిద్ధం చేసింది. మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021ని బెళగావిలో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదించనున్నారు. ఈ చట్టం ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ తీరని వారిని, మహిళలు, మానసిక వైకల్యం ఉన్నవారిని బలవంతంగా మతమార్పిడి చేస్తే 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా ఉంటుంది. ఇక ఇతర వర్గాల వారిని బలవంతంగా మతం మారిస్తే…3 నుంచి 5 ఐదేళ్లవరకు జైలుశిక్ష. 25 వేల రూపాయల జరిమానా విధిస్తారు. ఇక సామూహికంగా మత మార్పిడులు చేయిస్తే… 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించేలా బిల్లు రూపొందించారు. ప్రలోభాలకు గురిచేసి రాష్ట్రంలో మత మార్పిడులు చేయిస్తున్నారని ఆరోపణలు, డిమాండ్లు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకోవాలనుకునే వారికి ఈ బిల్లులో వెసలు బాటు కల్పించారు.అయితే ఈ బిల్లుపట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ రహస్య ఎజెండాలో భాగమే ఈ చట్టం అని కాంగ్రెస్, జేడీఎస్ మండిపడుతున్నాయి. అయితే బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేందుకే తప్ప ఏ మతానికీ ఈ బిల్లు వ్యతిరేకమో అనుకూలమో కాదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.