మన తెలంగాణ సమాజంలో గోరింటాకుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇంటి ఆడబిడ్డ గోరింటాకు పెట్టుకుని కళకళలాడుతూ తిరుగుతుంటే ఆ సందడే వేరు. నిజానికి భారత జీవన విధానంలో సాంప్రదాయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి సాంప్రదాయంలో ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయత కూడా దాగి ఉంది. ఋతువులకు మాసములకు అనుగుణంగా ఉత్సవాలు, పండుగలు జరుపుకునే సంప్రదాయం మనది. అదే విధంగా ఆషాడ మాసంలో గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం మనం పాటిస్తాం.
ఈ గోరింటాకు చేతులకు పెట్టుకోవడం కేవలం అందం మాత్రమే కాదు, అందులో శాస్త్రీయత ఉంది. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోక పోయినా ఆషాడంలో ప్రతి ఆడపిల్ల (మహిళ) తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అది ఎర్రగా పండితే ఎంతగానో మురిసి పోతుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమేకాదు, దీని వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.
ఆషాడ మాసంలో వర్షాల వలన వాతావరణం అంతా చల్లగా మారుతుంది. సూక్ష్మ క్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తుంటాయి. బయట వాతావరణానికి సమానంగా మన శరీరంలో మార్పు ఉండనందున కొంత చికాకుగా ఉంటుంది. కాబట్టి ఈ గోరింటాకులో వేడిని తగ్గించే అధ్బుతమైన గుణం ఉంది. రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఫలితంగా బాలికలు, మహిళల ఆరోగ్యానికి చక్కటి మేలు కలిగిస్తుంది.
శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిశు మందిర్ పాఠశాలలు.. కేవలము చదువు మాత్రమే కాకుండా భారతీయ జీవన విలువలు, సాంప్రదాయాల్లో శిక్షణ ఇస్తుంటాయి. ఇందులో భాగంగానే బాలిక విద్య అనే పేరుతో శాస్త్రీయత, పండుగలు, సాంప్రదాయాలు నేర్పుతారు. అనేక పాఠశాలల్లో ఆషాడమాసంలో బాలికలను పిలిపించి సామూహికంగా గోరింటాకు పెట్టించడం ద్వారా సాంప్రదాయాల పట్ల అభిరుచిని కల్పిస్తున్నారు.
హైదరాబాద్ శారద ధామంలోని
శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో ఈ గోరింటాకు సంబరాలు నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు అర్జున్ గౌడ్, కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్ ప్రధాన ఆచార్యులు భిక్షపతి సూచన మేరకు.. పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ కార్యక్రమం తో పిల్లలు ఎంతో మురిసిపోయారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోధ్ శిశు మందిర్ లో గోరింటాకు సంబరాలు వినూత్నంగా నిర్వహించారు. చిన్నారులను ఒక చోటకు చేర్చి మహిళా ఉపాధ్యాయులు గోరింటాకు పెట్టించారు. పాఠశాల ప్రధానాచార్యులు కొండ రాజేందర్ గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక శిశు మందిర్ పాఠశాలల్లో గోరింటాకు సంబరాలు ఉత్సాహంగా జరిగాయి.
నేటి బాలికలే రేపటి సాంప్రదాయ సమాజ నిర్మాణానికి ఆధారాలు.