ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని గోరఖ్నాథ్ ఆలయ ప్రాంగణంలోకి ఓ వ్యక్తి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అతను పదునైన ఆయుధం కలిగి ఉన్నాడు. అతనిని అదుపుచేయడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసులను గాయపరిచాడు. దాడి చేసిన వ్యక్తిని అహ్మద్ ముర్తాజా అబ్బాసీ గ గుర్తించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ ఆలయ ప్రధాన పూజారి (మహంత్)గా ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో తన వ్యక్తిగత వసతిని కూడా కలిగి ఉన్నారు. దాడి జరిగిన సమయంలో సీఎం యోగి ఆలయంలో లేరు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, అబ్బాసీ ఎలాగైనా ప్రాంగణంలోకి ప్రవేశించాలనుకున్నాడు. ఆలయ ప్రధాన ద్వారం గోరఖ్నాథ్ పోలీస్ స్టేషన్ ముందు ఉంది. కానిస్టేబుల్ గోపాల్ గౌడ్, అనిల్ పాశ్వాన్లను ప్రధాన గేటు వద్ద బందోబస్తుగా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి 7:15 గంటలకు ఆ వ్యక్తి ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు, తనిఖీ కోసం పోలీసు సిబ్బంది అతన్ని ఆపినప్పుడు, అతను వారి దగ్గరున్న ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించాడు, విఫలమవడంతో పదునైన ఆయుధంతో పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు.
ఏం జరిగిందో పోలీసులు గ్రహించేలోపే అబ్బాసీ వారిని తీవ్రంగా గాయపరిచాడు. ఆ తరువాత అతను ‘అల్లా హు అక్బర్’ అని అరుస్తూ ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నాడు. కానిస్టేబుల్ అనురాగ్ రాజ్పుత్, ఏఐయూ అధికారి అనిల్ అడ్డుకున్నారు. వారిని కూడా గాయపరిచేందుకు అబ్బాసీ ప్రయత్నించాడు. కానిస్టేబుల్ రాజ్పుత్, అనిల్ అతనిపై దాడి చేయడంతో అతను గేటు వద్దకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆలయ ప్రాంగణానికి చేరుకుని అబ్బాసీని కొట్టారు. అబ్బాసీ ఒంటరిగా లేడని నివేదికలు సూచిస్తున్నాయి. అబ్బాసీ తోపాటు మరొక వ్యక్తి కూడా తప్పించుకున్నాడు. అతను ఒక బ్యాగ్ను వదిలివెళ్లాడు. అందులో పోలీసులకు ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, విమాన టిక్కెట్ సహా పాన్ కార్డ్ లభించాయి.
https://twitter.com/MhaAgyaani/status/1510689107172741121?s=20&t=nRAgKh_Lcoqdcvg5VAQiSw
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (గోరఖ్పూర్ రేంజ్) జె రవీందర్ గౌడ్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విపిన్ తడాతో కలిసి ఘటనా స్థలాన్ని, అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ఆలయ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.. దాడి వెనుక ఉద్దేశాన్ని నిర్ధారించడానికి పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. అబ్బాసీ పట్టుబడినప్పుడు ‘ఎవరో నన్ను కాల్చివేస్తారు’ అని అరవడం వినిపించిందని నివేదికలు సూచించాయి.
సీఎం యోగి తరచూ ఆలయాన్ని సందర్శిస్తుండటంతో ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి ఏర్పడిందని జోన్ ఏడీజీ అఖిల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఉగ్రదాడి అనే కోణంతో సహా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వృత్తిరిత్యా కెమికల్ ఇంజనీర్ అయిన అబ్బాసీ, కుటుంబ సమస్యల కారణంగా మానసికంగా కలత చెందినట్లు విచారణలో పేర్కొన్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. నివేదికల ప్రకారం, అతను ఐఐటి బాంబే నుంచి కెమికల్ ఇంజనీర్ గా పట్టా పొందాడు. అతని తల్లిదండ్రులను పోలీసులు వారి నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భద్రతను పెంచారు.