తొలితరం స్వయం సేవకులలో ఒకరైన పులుసు గోపిరెడ్డి కన్నుమూశారు. రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తుదిశ్వాస విడిచారు. వాకాడు (విద్యానగర్), వికారాబాద్ లోనూ లెక్చరర్ గా పనిచేశారు. విజయవాడలో శారదా జూనియర్ కాలేజి, సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత మూడు సంవత్సరాలపాటు చత్తీస్ గఢ్ వెళ్లి అక్కడ వనవాసులతో గడిపారు.
గోపిరెడ్డి…సమాలోచన అనే మేధావుల వేదికను విజయవాడలో ఏర్పాటు చేసి, చిరకాలం అధ్యక్షులుగా ఉండి ఎందరో పెద్దలను విజయవాడకు పిలిపించి ఉపన్యాసా లిప్పించారు.
జాగృతి పత్రికలో దశాబ్దాల పాటు `మనలోమాట’ అనే శీర్షికను నిర్వహించారు. పలు పత్రికలలో వందలాది వ్యాసాలు వ్రాసారు. రాణాప్రతాప్, ఎదిగిన మనిషి(నవల), తరంమారింది (కథల సంపుటి), వికసిత సంఘ కుసుమం (మా. సోమేపల్లి సోమయ్యగారి జీవిత పరిచయం) దారిచూపిన దీపకళిక (శ్రీ గురూజీ జీవిత పరిచయం), వనయోగి (బాలాసాహెబ్ దేశపాండే జీవితపరిచయం), నేతాజీ, మరువ రాని మహామహులు మొదలైన ఎన్నో గ్రంథాలు రచించారు.
విజయవాడలోసంఘానికి, జాతీయ భావంతో మెలగే ఉద్యమాలకూ పెద్దదిక్కుగా ఉన్నారు గోపిరెడ్డి. 1973-73లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షునిగా పనిచేశారు. ఎందరో సామజిక కార్యకర్తలకు మార్గదర్శిగా నిలిచారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.