గుడ్న్యూస్..డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ పొందేయొచ్చట..!
ఇకపై రాబోయే రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరింత సులువు కానుంది. లైసెన్సులు జారీ చేసి ప్రక్రియ వేగవంతం చేసేందుకు సరికొత్త విధానంతో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు అక్రిడిటేషన్ కోసం.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పౌరులకు డ్రైవింగ్లో క్వాలిటీతో కూడిన ట్రైనింగ్ అందించేలా ఈ కేంద్రాలకు నిర్ధిష్టమైన అర్హతలు ఉండేలా ఈ డ్రాఫ్ట్ను రూపొందించింది. ఈ కేంద్రాల్లో డ్రైవింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ కోసం పెట్టే టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుందని ఈ నోటిఫికేషన్లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ ప్రక్రియ ద్వారా.. సుశిక్షితులైన డ్రైవర్లు బయటకు వస్తారని.. దీంతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని సదరు మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. రాబోయే 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలనే లక్ష్యంతో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ డ్రాఫ్ట్ను ముందుకు తెచ్చింది.