యూపీలో గుడ్ “టైమ్”: ఇది యోగి పుణ్యం
కరోనా కాలంలో ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించడం, వలస కూలీలకు తిండి పెట్టి స్థానికంగానే పనిచేసుకునే వీలుకల్పించడం వంటి చర్యలు తీసుకోవడంలో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. అమెరికాకు చెందని ప్రపంచ ప్రఖ్యాత టైమ్ వారపత్రిక తాజీ సంచికలో దీనిపై ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. యోగి ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరించింది. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి రాయడం వేరు. దేశంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం గురించి ఈ అంతర్జాతీయ పత్రికలో సుదీర్ఘ కథనం రావడం విశేషం.
కరోనా కాలంలో అనుమానితులను గుర్తించడానికి యోగి ప్రభుత్వం భారీగా పోలీస్ యంత్రాంగాన్ని ఇతర సిబ్బందిని ఉపయోగించింది. వలస కూలీల రూపంలో ఆ ప్రభుత్వానికి పెద్ద సవాలు ఎదురైంది. వివిధ రాష్ట్రాల నుంచి యూపీ వలస కూలీలు వేల మంది స్వరాష్ట్రానికి తిరుగు ప్రయాణమయ్యారు. కాలినడకన వెళ్తున్న వారిని రైళ్లలో తరలించడానికి మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యోగి ప్రభుత్వం కూడా కేంద్రంతో సంప్రదిస్తూ అవసరమైన ప్రత్యేక రైళ్లను నడిపేలా ఏర్పాట్లు చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే వలస కూలీల రైలు ప్రయాణ ఖర్చుతో పాటు వారి భోజన సదుపాయాల ఖర్చును కూడా భరించాయి. వారిని ఉచితంగానే స్వస్థలాలకు తరలించాయి. అలా యూపీ చేరుకున్న లక్షల మంది వలసకూలీలకు రోజుల తరబడి భోజన ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. లాక్ డౌన్ కాలంలో 67.5 మిలియన్ల ఆహార పొట్లాలను వలస కూలీలకు యూపీ ప్రభుత్వం అందించిందని టైమ్ పత్రిక కథనంలో తెలిపింది. లాక్ డౌన్ మొదలు కాగానే వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ దారులకు అడ్వాన్సుగా రెండు నెలల పింఛన్ డబ్బలు ఇచ్చింది.
వలస కూలీలకు ఇక యూపీలోనే ఉపాధి కల్పించడానికి యోగి సర్కార్ భారీ కార్యక్రమం చేపట్టింది. పెద్ద సంఖ్యలో సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలు తెరిపించింది. వాటికి ఉదారంగా రుణాలు అందించింది. టైమ్ పత్రిక కథనం ప్రకారం, సుమారు 8 లక్షల ఎం.ఎస్.ఎం.ఇ. యూనిట్లు లాక్ డౌన్ కాలంలో పనిచేసేలా చూశారు. వాటిలో 51 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. యూపీ సర్కార్ 4 లక్షల 35 వేల పారిశ్రామిక యూనిట్లకు మొత్తం మీద 107.44 బిలియన్ రూపాయల రుణాలను ప్రభుత్వం ఇచ్చింది. ఆత్మనిర్భర్ యూపీ పథకం కింద మరో 25 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించింది. అంటే 25 లక్షల మంది వలస కూలీలకు సొంత రాష్ట్రంలోనే ఉపాధి లభించింది. కరోనా రికవరీ రేటు యూపీలోనే అధికం. మరణాల రేటు యూపీలోనే కనిష్టం అని టైమ్ పత్రిక పేర్కొంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్తగా ఆలోచించి, కరోఆ కట్టడికి చర్యలు తీసుకోవడం ద్వారా కనీసం 85 వేల మంది ప్రాణాలను కాపాడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు.
తెలంగాణలో కనీసం రోజుకు 50 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని హైకోర్టు చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీలో ప్రతి రోజూ లక్షా 75 వేల టెస్టులు చేశారు. కరోనా యోధులకు విశ్రాంతి కోసం కూడా యోగి సర్కార్ కొత్తగా ఆలోచించింది. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు ఆ సమయంలో ఇంటికి వెళ్లడం కుటుంబ సభ్యులకు కూడా రిస్కుగా భావించే వారు. కాబట్టి వాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయివేటు హోటళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాటిని కరోనా వారియర్స్ రెస్ట్ రూములుగా ఉపయోగించింది. ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా ఇలాగే ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. లాక్ డౌన్ కాలంలో టూరిస్టులు, కస్టమర్లు రావడానికి అవకాశం లేదు కాబట్టి హోటళ్ల యాజమాన్యాలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇలా, యోగి ప్రభుత్వం కరోనా యోధులకు సౌకర్యాలు కల్పిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడింది. కార్మికులకు, ఉద్యోగులకు ఉపాధి కల్పన కోసం కూడా కృషి చేసింది. బహుముఖ వ్యూహంతో సీఎం యోగి ముందుకు వెళ్తున్నారని టైమ్ పత్రిక పేర్కొంది.