గుడ్న్యూస్.. పెట్రోల్,డీజీల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.
పెట్రోల్,డీజిల్ ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీపికబురు చెప్పారు. గత కొద్ది రోజులుగా వినియోగదారులకు పెట్రోల్,డీజిల్ ధరలు చుక్కలుచూపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100/- మార్క్ను దాటేసింది. అయితే పలు రాష్ట్రాల్లో వ్యాట్ ధరల మార్పు వల్లే పెట్రోల్ ధరలు సెంచరీ మార్కును దాటాయని విశ్లేషకులు చెబుతున్నారు. వరుసగా పెరుగుతున్న ధరలను చూసి వినియోగదారుల్లో ఆందోళన రేపుతోంది. ఈ క్రమంలో కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు కూడా మొగ్గుచూపుతున్నారు. అయితే వినియోగదారుల్లో నెలకొన్న టెన్షన్ను తగ్గించేలా కేంద్రమంత్రి స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఇకపై వరుసగా ధరలు తగ్గుముఖం పడుతాయని చెప్పారు.
కాగా, కరోనా కారణంగా గ్లోబల్ సరఫరా కూడా తగ్గిందని.. దీని ప్రభావం చమురు ఉత్పత్తిపై కూడా చూపెట్టిందన్నారు. ఇక పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తాము జీఎస్టీ కౌన్సిల్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.