రాజన్న భక్తులకు గుడ్న్యూస్.. ఉచిత బస్సు సౌకర్యం..
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం రాజన్న భక్తులకు శుభవార్త తెలియజేసింది. జాతర సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. బుధవారం నాడు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తిప్పాపూర్ బస్టాండ్లో ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి తరలివస్తుంటారని.. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వారి కోసం ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటుచేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 14 మినీ బస్సులను ఏర్పాటు చేసింది. వీటిలో వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ నుంచి కొన్ని బస్సులను, కోరుట్ల బస్టాండ్ నుంచి మరికొన్ని బస్సులను రాజన్న గుడిచెరువు వరకు నడిపించనున్నారు. మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు జరగనున్నాయని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసులను కల్పించినట్లు జెడ్పీ చైర్పర్సన్ తెలిపారు.