ప్రముఖ నటి బిజెపి నాయకులు జయప్రదకు న్యాయ పోరాటంలో ఊరట లభించింది. ఎన్నికల కోడ్ కు సంబంధించిన వివాదంలో ఆమె నిరపరాధి అని న్యాయస్థానం ప్రకటించింది. దీంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. రాగల కాలంలో రాజకీయ కార్యకలాపాలు వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జయప్రద ఎన్నికల కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఉత్తర్ ప్రదేశ్లోని రాంపూర్ లోక్సభ స్థానం నుంచి 2019 ఎన్నికలలో పోటీ చేసిన సందర్భంగా జయప్రదపై స్వర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా ఆమె నూర్పూర్ గ్రామంలో బహిరంగ సభను నిర్వహించి రోడ్డును ప్రారంభించారన్నది అభియోగం . ఆ ఎన్నికలలో ఆమె బిజెపి టిక్కెట్పై రాంపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆరోపణలకు తగిన ఆధారాలు లేవన్న కారణంతో జయప్రదను నిరపరాధిగా న్యాయమూర్తి శోభిత్ బన్సాల్ తీర్పు చెప్పారు. కోర్టు తీర్పుపై జయప్రద హర్షం వ్యక్తం చేశారు. రాంపూర్కు తాను రాకుండా కొందరు కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.అయితే రాంపూర్ తనకు రెండో ఇల్లు లాంటిదని, ఇక్కడకు తరచు వస్తూనే ఉంటానని జయప్రద విలేకరులకు తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికలలో తాను రాంపూర్ నుంచే పోటీ చేస్తానని కూడా ఆమె ప్రకటించారు.
త్వరలో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలలో జయప్రద అసెంబ్లీ కోసం పోటీ చేస్తారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. న్యాయ పోరాటంలో ఆమెకు క్లీన్ చిట్ లభించింది కాబట్టి ఆమె ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి