మాదిగ సామాజిక వర్గం కు శుభవార్త వినిపించింది. ఎస్సీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవచ్చు అని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో సుదీర్ఘకాలంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం నడుస్తోంది. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ ఆయన్ని కలవడం జరిగింది. మాదిగల న్యాయపరమైన డిమాండ్ ను అర్థం చేసుకుంటున్నామని ప్రధానమంత్రి అప్పుడే హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వము అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నట్లు తెలియజేసింది. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టత ఇచ్చింది. గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది.
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీల్లోని వెనకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రిజర్వేషన్ కోటాను రాష్ట్రాలు విభజించవచ్చని కీలక తీర్పునిచ్చింది
జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రా సభ్యులుగా ఉన్నారు. ఇందులో ఆరుగురు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపారు. జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. మెజారిటీ తీర్పుతో తాను విభేదిస్తున్నానని, రాజ్యాంగంలోని 341వ అధికరణ కింద నోటిఫై చేసిన ఎస్సీ జాబితాను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఎస్సి, ఎస్టీ, ఓబిసి వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అప్పుడే ప్రభుత్వాలు సరైన పథకాలు రూపొందించగలవని తెలిపింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న కల ఉపవర్గీకరణ ద్వారా సాకారం అవుతుందని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు తీసుకురావడం వెనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే కోటా హేతుబద్ధీకరణ చాలా ముఖ్యమని వివరించారు.