పార్లమెంట్ ఎన్నికల కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ … ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తెలంగాణలో సాధ్యమైనంత ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓటింగ్ శాతం పెంచుకునేందుకు అన్ని మార్గాలనూ వెదకుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలతో బిజెపి పొత్తు పెట్టుకుంది. అక్కడ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంటోంది . అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి, తెలంగాణలో తెలుగుదేశం ప్రస్తుతం.. బలమైన పార్టీ కాకపోవచ్చు కానీ ,, చాలా చోట్ల ఇప్పటికీ.. ఆ పార్టీకి క్యాడర్ మరియు అభిమానులు దండిగా ఉన్నారు . అందువల్లనే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పొత్తు పుణ్యమా అని జంట నగరాల్లో నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు బీజేపీ కి దక్కాయి. కానీ 2018, 2023లో నిరాశకర ఫలితాలు ఎదురయ్యాయి.
మరోవైపు , ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం తో పొత్తు ఉన్న దృష్ట్యా టిడిపి మరియు జనసేన శ్రేణుల్ని ఆకర్షించేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలు పెట్టింది. బిజెపి ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో బిజెపికి మద్దతిస్తున్నట్లుగా ప్రకటన చేయించారు . అన్ని పార్లమెంటు స్థానాల్లో బిజెపి అభ్యర్థులకే తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఓటు వేయాలని తెలంగాణ తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
అంతేకాకుండా ఈనెల 10వ తేదీన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే బహిరంగ సభకు జంట నగరాల్లోని తెలుగుదేశం మరియు జనసేన ఆహ్వానిస్తున్నట్లుగా బిజెపి నేతలు తెలియజేశారు. మొత్తం మీద టీడీపీ జనసేన కలయికతో బిజెపికి ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.